అద్దె చెల్లించలేడం లేదని గృహ యజమాని గ్రామ సచివాలయానికి తాళం వేసిన ఘటన గంపలగూడెం మండలం ఊటుకూరులో బుధవారం వెలుగుచూసింది. ఊటుకూరులో గ్రామ సచివాలయం-2ను నడిపేందుకు గ్రామానికి చెందిన వేముల ప్రకాశ్ బాబ్జికి సంబంధించిన ప్రయివేటు భవనాన్ని నెలకు రూ.5,500లకు అద్దె చెల్లించే విధంగా 2019 అక్టోబరు 2 నుంచి ఎంపీడీవో వై.పిచ్చిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి విజయ్వర్ధన్లు ఒప్పందం చేసుకున్నారు. అప్పటి నుంచి 2022 అక్టోబరు 2 వరకు మూడేళ్లు పూర్తి అయినా ఒక్క నెల అద్దె కూడా చెల్లించలేదు. 37 నెలలకు సంబంధించి విద్యుత్ బిల్లుతో కలుపుకొని రూ.2.12 లక్షలు అధికారులు యజమానికి చెల్లించాల్సి ఉంది. తనకు అద్దె చెల్లించాలని ప్రకాశ్ బాబ్జి ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో రెండు సార్లు స్పందనలో ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి అక్కడి నుంచి అద్దెకు సంబంధించిన నగదును తీసుకోవాల్సిందిగా ఎంపీడీవో గృహ యజమానికి తెలిపారు. దీంతో 20 మాసాల క్రితం అద్దె చెల్లింపుపై సర్పంచి బొల్లిపోగు రేణుక తీర్మానం చేశారు. అయినా అద్దె చెల్లింపు జరగలేదు. గ్రామ సచివాలయం-2 సేవలు ఎక్కువ భాగం గాదేవారిగూడెం గ్రామ ప్రజలు వినియోగించుకుంటున్నారని, ఆ గ్రామ పంచాయతీ నుంచి తీసుకోండని సర్పంచ్ ప్రకాశ్ బాబ్జికి తెలిపారు. ఈ అంశాన్ని గాదేవారిగూడెం సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లగా తమకు నగదు చెల్లింపుతో సంబంధం లేదన్నారు. చేసేదిలేక ప్రకాశ్ బాబ్జి సచివాలయ సిబ్బందిని బయటకు పంపి కార్యాలయానికి తాళం వేశారు. దీనిపై ఎంపీడీవో మాట్లాడుతూ అద్దె బకాయి చెల్లిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa