ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విక్రయానికి దాదాపు 50కోట్ల మంది యూజర్ల ఫోన్‌ నంబర్లు

international |  Suryaa Desk  | Published : Sun, Nov 27, 2022, 03:58 PM

సాంకేతికత పెరిగాక నేరం ఎటువైపు నుంచి సాగుతుందో చెప్పడం కష్టంగా మారింది. తాజాగా మన  ప్రపంచంలో అందరూ వాడే వాట్సాప్ యాప్ ఇపుడు ఎంతవరకు శ్రేయస్కరమన్న వాదన మొదలైంది.  ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ నుంచి భారీగా డేటా లీక్‌ కావడం కలకలం రేగుతోంది. దాదాపు 50కోట్ల మంది యూజర్ల ఫోన్‌ నంబర్లు ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచినట్లు తాజాగా సైబర్‌న్యూస్‌ నివేదిక బయటపెట్టింది. అమెరికా సహా పలు దేశాలకు చెందిన యూజర్ల డేటాను హ్యాకర్లు అమ్మకానికి ఉంచినట్లు తెలిసింది. ఓ హ్యాకింగ్‌ కమ్యూనిటీ ఫోరమ్‌లో వీటి విక్రయానికి సంబంధించిన ప్రకటన ఉంచినట్లు సైబర్‌న్యూస్‌ కథనం పేర్కొంది. 48.7కోట్ల వినియోగదారుల ఫోన్‌ నంబర్లతో 2022 డేటాబేస్‌ను విక్రయిస్తున్నట్లు ఓ హ్యాకర్‌ ఆన్‌లైన్‌లో ప్రకటన ఇచ్చాడు. అమెరికా, బ్రిటన్, ఈజిప్టు, ఇటలీ, సౌదీ అరేబియా సహా 84 దేశాలకు చెందిన యూజర్ల నంబర్లను అమ్మకానికి పెట్టారని సైబర్‌న్యూస్ కథనం వెల్లడించింది. ఇందులో భారత యూజర్ల నంబర్లు కూడా ఉన్నాయి.


అత్యధికంగా ఈజిప్ట్‌‌కి చెందిన 4.5కోట్ల మంది యూజర్ల నెంబర్లను అమ్మకానికి పెట్టారు. తర్వాత ఇటలీ 3.5 కోట్లు, అమెరికా 3.2 కోట్లు, సౌదీ అరేబియా 2.9కోట్లు, ఫ్రాన్స్‌ 2 కోట్లు, తుర్కియేకి 2 కోట్లు, బ్రిటన్ 1.1కోట్లు, రష్యా దాదాపు కోటి మంది వాట్సప్‌ యూజర్ల నంబర్లు లీకైనట్లు సైబర్‌న్యూస్‌ కథనం తెలిపింది. ఒక్కో దేశానికి చెందిన నంబరుకు ఒక్కో ధరను నిర్ణయించినట్టు పేర్కొంది. అమెరికా డేటాసెట్‌ అయితే 7వేల డాలర్లు, యూకే డేటా ధర 2,500 డాలర్లు, జర్మనీ యూజర్ల నంబర్ల ధర 2వేల డాలర్లుగా ఉన్నట్లు పేర్కొంది.


ఈ నంబర్లను సైబర్‌ నేరగాళ్లు కొనుగోలు చేసుకుని మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. అందువల్ల, గుర్తుతెలియని నంబర్ల నుంచి కాల్స్‌, మెసేజ్‌లు వస్తే స్పందించొద్దని సూచించింది. వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. సైబర్‌న్యూస్ పరిశోధకులతో షేర్ చేసిన నమూనాలో యూకేకు చెందిన 1097 మంది, అమెరికాకు చెందిన 817 యూజర్ నంబర్‌లు ఉన్నాయి. సైబర్‌న్యూస్ నమూనాలో చేర్చిన అన్ని నంబర్‌లను పరిశోధించింది. అవన్నీ వాస్తవ వాట్సాప్ వినియోగదారులేనని నిర్ధారించింది.


అమ్మకానికి ఉంచినవారు డేటాబేస్‌ను సేకరించడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సైబర్‌న్యూస్‌లోని అన్ని నంబర్‌లు యాక్టివ్ వినియోగదారులకు చెందినవని పేర్కొంది. దీనిపై వాట్సాప్ మాతృ సంస్థ మెటాను సైబర్‌న్యూస్ సంప్రదించగా.. తక్షణమే స్పందించడానికి నిరాకరించింది. మరింత లోతుగా విశ్లేషిస్తామని పేర్కొంది. ఇదిలా ఉండగా, మెటాకు చెందిన సంస్థల్లో డేటా లీక్ ఘటనలు చోటు చేసుకోవడం ఇదేం తొలిసారి కాదు. గతంలో కూడా ఓసారి భారీగా డేటా లీక్ అయ్యింది. గతేడాదిలో 50 కోట్ల మందికిపైగా ఫేస్‌బుక్‌ వినియోగదారుల డేటా హ్యాకర్ల చేతికి చిక్కి.. ఆన్‌లైన్‌లో లీకైనట్టు వార్తలు వచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa