మహిళలకు కుటుంబ ఆస్తిలో హక్కు కల్పించింది ఎన్టీఆర్ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆడబిడ్డలు బాగా చదువుకోవాలని మహిళా విద్యను తెలుగుదేశం ప్రోత్సహించింది అని తెలిపారు. ఆడబిడ్డలు రాజకీయాల్లో రాణించే శక్తి ఉందని... ఆడబిడ్డలకు రాజకీయంగా 9 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీ అని స్పష్టం చేశారు.
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో వివిధ వర్గాల మహిళలతో నారా చంద్రబాబు నాయుడు మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమ సమస్యలు, కష్టాలు చంద్రబాబుకు చెప్పుకున్నారు. పథకాల తొలగింపు, టిడ్కో ఇళ్లు కేటాయించకపోవడం వంటి అంశాల్లో తమ బాధను వ్యక్తం చేశారు. పిల్లలు డ్రగ్స్ కు, గంజాయికి అలవాటు పడుతున్న వైనంపై తల్లులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు.
"సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కోటిమందికి పైగా డ్వాక్రా మహిళలను మెంబర్లుగా చేర్చాను. ఈ రోజు ఇక సాధారణ మహిళ బయటకు వచ్చి గట్టిగా మాట్లాడే స్థాయికి చేర్చింది డ్వాక్రా సంఘం. వారు డ్వాక్రా మీటింగ్ కు వెళుతుంటే నాడు మగవారు ఎగతాళి చేశారు. తమ పనితీరుతో ఎగతాళి చేసిన మగవాళ్ల నోర్లు మూయించారు మహిళలు. ఆడబిడ్డలు కట్టెల పొయ్యితో ఇబ్బంది పెడుతుంటే నాడు దీపం పథకం పెట్టాను. గ్యాస్ పొయ్యిలు రావడంతో మగవాళ్లు కూడా వంట చెయ్యడం మొదలు పెట్టారు. మహిళల ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్డు ఇచ్చాము. అలాంటి మరుగుదొడ్లకు కూడా పన్ను వేసిన వాడు జగన్ రెడ్డి.
డ్వాక్రా సంఘాలు పెట్టింది చంద్రబాబు అని, అవి దేశానికి తలమానికం అయ్యాయి అని ప్రధాని కూడా చెప్పారు. మహిళలకు విద్యలో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చాను. దీంతో చాలా సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఆడబిడ్డలు ఈ అవకాశంతో భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఐటీలో భర్తల కంటే భార్యలే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఆడపిల్లలు బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తుండడంతో వరకట్నం పోయింది.
డ్వాక్రా సంఘాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం... డ్వాక్రా బజార్లు పెట్టి ప్రమోట్ చేశాం. కానీ జగన్ డ్వాక్రా వాళ్లకు పథకాలు నిలిపివేశాడు... తన మీటింగ్ లకు మాత్రం డ్వాక్రా మహిళలు రావాలి అంటున్నాడు. డ్వాక్రా సంఘాలు ఉన్నది సీఎం జగన్ మీటింగ్ లు వినడానికి కాదు... సంఘాలు స్వయం సాధికారత సాధించాలి. ముఖ్యమంత్రి సభకు వచ్చిన మహిళలు నల్ల చున్నీలతో వచ్చారని వాటిని లాగేసిన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం వల్ల వచ్చిన లాభం ఎంత...భారం ఎంత అనేది మహిళలు చూడాలి.
దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కంటే...మన ఇంటిని నడిపే మహిళా హోం మినిస్టర్ సమర్థులు. లేని దిశ చట్టం పేరు చెప్పి జగన్ మోసం చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో డ్వాక్రా సంఘాలు ముందు ఉండాలని నేను కోరుకున్నా" అని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa