ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విచారణ పేరుతో జేబీ సంస్థ సీఐడీని ఉసిగొల్పుతున్నారు: పట్టాభీరామ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 11:41 PM

యువతకు నైపుణ్య శిక్షణ అందించి 64 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల పనితీరుని చూసి, సంతోషంగా ఉంటున్న యువతను చూసి జగన్ ఓర్వలేకపోతున్నాడని సీఎం జగన్ పై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. తన జేబు సంస్థ సీఐడీని విచారణ పేరుతో కొందరిపైకి ఉసిగొల్పి, తన పకోడి పేపర్లో చంద్రబాబు, లోకేశ్ లు రూ.241 కోట్ల అవినీతి చేశారంటూ విషపురాతలు రాయిస్తున్నాడని పట్టాభి ఆగ్రహం వ్యక్తంచేశారు. 


యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పారు. వాటిలో భాగంగా  6 సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్ర్రాలు, 34 టెక్నికల్ స్కిల్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూట్ కేంద్రాలను రాష్ట్రంలోని ప్రముఖ విద్యాలయాల్లో ఏర్పాటు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేశాక, వాటిని గాలికి వదిలేయకుండా నాటి టీడీపీ ప్రభుత్వం 64 వేలమందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించింది. 


స్కిల్ డెవలప్  కేంద్రాల ద్వారా 2 లక్షల పైచిలుకు యువత, వారి కుటుంబాలు బాగుపడటం జగన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆ క్రమంలో పనిగట్టుకొని మరీ, స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల పేరుతో అవినీతికి పాల్పడ్డారంటూ పసలేని ఆరోపణలకు తెరలేపాడు. ఎవరు సంతోషంగా ఉన్నా, ఏ కుటుంబం పచ్చగా ఉన్నా చూసి ఓర్వలేని జగన్ రెడ్డి, తన బులుగు మీడియా ద్వారా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో రూ.241 కోట్ల అవినీతి జరిగిందని విషపురాతలు రాయించాడు. 


అంతటితో ఆగకుండా ఆ సొమ్మంతా చంద్రబాబు, లోకేశ్ తినేశారని, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వద్ద ఉన్నాయని సిగ్గు, శరం లేకుండా దుష్ప్రచారం చేస్తున్నాడు.  ఈడీ పేరు వినగానే ఫోన్ లు పారేసుకోవాల్సిన ఖర్మ మాకు పట్టలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ శరత్ చంద్రారెడ్డిని అదుపులోకి తీసుకోవడంతోనే మన ఏ2 విజయసాయి రెడ్డి తన ఫోన్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం ప్రజలు మరిచిపోలేదు. లిక్కర్ స్కామ్ లో ఎక్కడ తనను మూసేస్తారోనన్న భయంతో విజయసాయి రెడ్డి భయంతో ఫోన్ పోయిందంటూ నాటకాలు ఆడుతున్నాడు. 


ఏదో ఒక కంపెనీ వారి స్వలాభం కోసం పన్ను ఎగ్గొడితే, దానికి గత ప్రభుత్వానికి, చంద్రబాబుకు సంబంధమేంటో జగన్ సమాధానం చెప్పాలి. ఇది కేవలం పన్ను ఎగవేతకు సంబంధించిన అంశం. అదే విషయాన్ని జీఎస్టీ డిపార్ట్ మెంట్ వారు కూడా ధ్రువీకరించారు. ఒక పన్ను ఎగవేత అంశాన్ని భారీ కుంభకోణం అన్నట్టు చిత్రీకరించి లక్షమందికి ఉపాధి కల్పిస్తున్న ఒక ప్రాజెక్టును నాశనం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎంతో సదుద్దేశంతో రాష్ట్ర యువత భవిత కోసం తీసుకొచ్చిన ప్రాజెక్టుపై దురుద్దేశంతో జగన్ విషం చిమ్ముతున్నారన్న వాస్తవాలను రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి” అని పట్టాభిరామ్ విజ్జప్తి చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa