కందుకూరులో చంద్రబాబు సభ పెట్టిన చోటే గతంలో జగన్ రెడ్డి, విజయమ్మ సభలు పెట్టడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి, విజయమ్మ పాదయాత్రల్లో 8 మంది మృతి చెంది, 45 మంది క్షతగాత్రులవ్వడం వాస్తవం కాదా? అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నిలదీశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనలో తీవ్ర విషాదం చోటు చేసుకోవడం తెలిసిందే. కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి 8 మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండడం పట్ల వర్ల రామయ్య అదేస్థాయిలో స్పందించారు.
"జగన్ రెడ్డి పాలనలో వివిధ ప్రమాదాల్లో 173 మంది ప్రాణాలు కోల్పోయింది వాస్తవం కాదా? విషాద సమయంలో వైసీపీ దుష్ప్రచారాలు రాజకీయ కక్కుర్తి కాదా? ప్రధాని, గవర్నర్ స్పందించేంత వరకు సీఎం స్పందించలేదంటే ఆయన మానసిక స్థితి దేనికి అద్దం పడుతుంది?" అంటూ వర్ల రామయ్య నిప్పులు చెరిగారు.
చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోయారంటూ వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు చాలా బాధాకరం అని పేర్కొన్నారు. "జగన్ రెడ్డి, తన తల్లి విజయమ్మ పాదయాత్రలు, బహిరంగ సభలు నిర్వహించిన సమయంలో అమాయకులు వివిధ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ మరణాలు జగన్ రెడ్డి, విజయమ్మ ప్రచార పిచ్చివల్లే జరిగిందా? అప్పుడు మీరు తీసిన డ్రోన్ విజువల్స్ ప్రచార పిచ్చికోసమేనా? దీనిపై జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.
జగన్ రెడ్డి, తన తల్లి విజయమ్మ పాదయాత్రలు చేసి, బహిరంగ సభలు కూడా కందుకూరు ఎన్టీఆర్ సర్కిల్ లోనే నిర్వహించారు. ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగు పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసింది. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు బహిరంగ సభలకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటుంటే తగిన బందోబస్తు ఏర్పాటు చేయడంలో విఫలమైంది.
కందుకూరులో ఎన్టీఆర్ సర్కిల్ కంటే పెద్ద రోడ్లు లేవు. ఆ సంగతి మీకు తెలిసి కూడా విమర్శలు చేయడం శవరాజకీయాలకు నిదర్శనం. మృతుల పట్ల కనీసం ఇంతైనా బాధ పడకుండా... వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాస్యాస్పద వ్యాఖ్యలు చేయడం పేదవాడి ప్రాణాలకు వైసీపీ ఇచ్చే విలువకు నిదర్శనం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa