ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక కొంగంచర్ల, గురివిందగుంట గ్రామాల రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆర్బీకే, సచివాలయం, తహసీల్దార్, వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో శనివారం రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. పెడననియోజకవర్గ పరిధిలోని కొంగంచర్ల, గురవిందగుంట గ్రామాల పరిధిలోని సుమారు 400 ఎకరాల్లోని పంట వర్షాలకు తడిచి ధాన్యం రంగుమారింది. రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రాపపోవడం, కొనే నాధుడు లేక ధాన్యం రాసులను రహదారుల వెంట గుట్టలుగా పోసి పట్టాలు కప్పి కాపాడుకుంటున్నారు. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం త్వరితగతిన కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులు ధాన్యాన్ని పరిశీలించి శాంపిల్స్ తీసుకువెళ్లారని, ధాన్యాన్ని కొనేది లేనిది చెప్పడంలేదని ఆరోపించారు. పాయశాతం పదిలోపు ఉంటే ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న నిబంధన ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మిల్లర్ల వద్దకు వెళితే ఆర్బీకేల ద్వారా మంచి ధాన్యం వస్తుంటే రంగుమారిన ధాన్యాన్ని తాము ఎలా కొంటామని మిల్లర్లు అంటున్నారని రైతులు తెలిపారు. రంగుమారిన ధాన్యానికి సంచులు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa