అమెరికాలో అక్కడి ప్రజలతో పోలిస్తే ప్రవాస భారతీయులు పది రెట్లు అధికంగా (40-50 మధ్య వయస్కులు) గుండె జబ్బుల బారినపడుతున్నారని అమెరికాలోని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ చలసాని ప్రసాద్ పేర్కొన్నారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ హెల్త్ సమ్మిట్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన వాల్వ్ రీప్లే్సమెంట్లో వచ్చిన అధునాతన వైద్య పద్ధతుల గురించి సదస్సులో ప్రసంగించారు. అనంతరం ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడారు. ‘‘కొవిడ్ తరువాత గుండె సంబంధిత సమస్యలతో వస్తున్న వారి సంఖ్య పెరిగింది. అయితే, కొవిడ్ వైరస్ బారినపడడం వల్లే వచ్చిందని స్పష్టంగా చెప్పలేం. కొవిడ్ వైరస్ వల్ల గుండె జబ్బులు ఏ స్థాయిలో పెరిగాయన్న విషయాన్ని నిర్ధారించడానికి కనీసం మరో ఐదు నుంచి పదేళ్లు పడుతుంది. గుండె జబ్బులతో బాధపడుతున్న వారిలో 3-5 శాతం మంది ఏటా చనిపోతున్నారు. భారత్తోపాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణం గుండె జబ్బు అవుతోంది. ఇది సైలెంట్ కిల్లర్గా మారుతోంది. ముఖ్యంగా 35-50 ఏళ్ల మధ్య వారిలో కొన్నేళ్ల నుంచి హార్ట్ ఎటాక్స్, సడన్ కార్డియాక్ డెత్స్ సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువత అప్రమత్తంగా ఉండాలి. అమెరికాలో స్థిరపడిన భారతీయులు ఎక్కువగా గుండె జబ్బులు బారినపడడానికి ప్రధాన కారణం తీవ్రమైన ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు, స్మోకింగ్, పోషకాహారం తీసుకోకపోవడం. 35 ఏళ్లు దాటిన వారిలో రిస్క్ ఫ్యాక్టర్స్ను గుర్తించడం ద్వారా గుండె జబ్బులు ముప్పును ముందే గుర్తించవచ్చు హై కొలెస్ర్టాల్, కుటుంబ నేపథ్యం, స్మోకింగ్, బీపీ వంటివి వున్న ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా కాల్షియం స్కోర్, కొలెస్ర్టాల్ పరీక్షలు చేయించుకోవాలి. వాల్వ్ రీప్లే్సమెంట్లో ప్రస్తుతం అధునాతన పద్ధతులు వచ్చాయి. దీన్ని పర్క్యుటేనస్ వాల్వ్ రీప్లే్సమెంట్గా పేర్కొంటారు. భారత్లోని కొన్ని నగరాల్లో మాత్రమే ఈ విధానం అందుబాటులో ఉంది. సాధారణ పద్ధతిలో చేసే దానికంటే ఇది అత్యంత సులభంగా చేయవచ్చు. అరగంట నుంచి గంటలో పూర్తవుతుంది. 24 గంటల్లోనే రోగి ఆస్పత్రి నుంచి వెళ్లిపోవచ్చు అని డాక్టర్ చలసాని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa