గత రెండున్నరేళ్లగా తనపై, తన కుటుంబంపై ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అసత్యపు ఆరోపణలు చేస్తోంది కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి అన్నారు. తనపై వచ్చిన అభియోగాలు జీర్ణించుకోలేకపోతున్నానని.. తానేమిటో, తన వ్యవహార శైలి ఏమిటో ఈ జిల్లా ప్రజలకు అందరికీ బాగా తెలుసన్నారు. న్యాయం గెలవాలి.. నిజం వెల్లడి కావాలన్నదే తన ధ్యేయమన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ నోటీసులు ఇవ్వడంపై కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి పై విధంగా స్పందించారు.మీడియా ముఖ్యంగా కోరుకుంటున్న నిజం తేలాలని తాను కూడా భగవంతుడుని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆరోపణ చేసేవారు మరొకసారి ఆలోచించాలని.. ఇలాంటి ఆరోపణ చేస్తే వాళ్ల కుటుంబాలు కూడా ఎలా ఫీల్ అవుతారో ఒకసారి ఊహించుకోవాలన్నారు.
సీబీఐ అధికారులు సోమవారం నోటీసు ఇచ్చారని.. మధ్యాహ్నం నోటీస్ ఇచ్చి మంగళవారం విచారణకు రమన్నారన్నారు. ముందే ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్స్ కారణంగా ఇవాళ విచారణకు రాలేనని చెప్పానని.. ఐదు రోజుల సమయం కావాలని కోరినట్లు వివరించారు. మళ్లీ నోటీస్ ఇస్తారని.. తప్పకుండా విచారణకు హాజరై సీబీఐ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తానన్నారు ఎంపీ.
ఎంపీ అవినాష్ రెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో.. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని సూచించారు. ఈ నోటీసులపై స్పందించిన ఎంపీ.. మంగళవారం తాను విచారణకు హాజరు కాలేనని సీబీఐకి లేఖ పంపారు. ఎంపీగా ఉన్న తాను ముందుగా నిర్ణయించి కార్యక్రమాలకు హాజరవ్వాల్సి ఉందని.. ఐదు రోజుల తర్వాత ఎప్పుడు పిలిచినా వస్తానని సమాధానం ఇచ్చారు. నియోజకవర్గంలోని కార్యక్రమాలతో మరో నాలుగు రోజుల పాటూ బిజీగా ఉంటానని.. ఆ తర్వాత ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని తెలిపారు.
ఏపీ రాజకీయాల్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 2019 మార్చిలో సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వైఎస్ వివేకా పులివెందులలోని నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు అప్పట్లో సంచలనంరేపింది. ఆ తర్వాత పరిణామాలతో హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. కానీ తన తండ్రి హత్య కేసు విచారణ సరిగా జరగడం లేదని.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు.. వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేసింది. ఇప్పుడు సీబీఐ విచారణను ముమ్మరం చేసింది. ఇప్పుడు ఈ కేసులో అవినాష్కు నోటీసులు ఇచ్చింది. ఎంపీ సమాధానంపై సీబీఐ ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa