ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తర కొరియా భూగర్భ అణ్వాయుధ పరీక్షలు,,,దీంతో భూగర్భ జలాలు కలుషితం

international |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2023, 12:35 AM

ఉత్తర కొరియా భూగర్భ అణ్వాయుధ పరీక్షలు భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదముందని మానవహక్కుల సంస్థ సంచలన నివేదిక వెలువరించింది. ఇదిలావుంటే  నిరంతరం అణ్వాయుధ పరీక్షలతో వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత బలమైన అణుసామర్థ్యం కలిగిన దేశంగా ఎదగాలన్న దాని ఆకాంక్ష లక్షలాది మంది ప్రజలకు పెను ముప్పుగా పరిణమించింది. అణ్వాయుధ ప్రయోగాలతో సొంత ప్రజలనే కాదు పొరుగున ఉన్న దక్షిణ కొరియా, చైనా, జపాన్‌ వాసుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతోంది. భూగర్భంలో ఉత్తర కొరియా చేపట్టిన అణు పరీక్షలు కారణంగా భూగర్భ జలాల కలుషితమవుతున్నాయని దక్షిణ కొరియాకు చెందిన ఓ మానవహక్కుల సంఘం అధ్యయనం వెల్లడించింది.


ఉత్తర కొరియా ‘పుంగే-రి’ భూగర్భ అణుపరీక్షా కేంద్రం కారణంగా భూగర్భ జలాలు కలుషితమై.. ప్రజలకు రేడియోధార్మికత ముప్పు పొంచి ఉందని ఆ అధ్యయనంలో పేర్కొంది. ఉత్తర కిరియా ఏడోసారి అణు పరీక్షకు సిద్ధమవుతోందని వార్తలు వస్తోన్న వేళ ఈ నివేదికకు ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికా, దక్షిణ కొరియాల సమాచారం ప్రకారం.. ఉత్తర కొరియా 2006-17 మధ్యకాలంలో ఉత్తర హమ్‌గ్యోంగ్ ప్రావిన్సుల్లోని పుంగేరి వద్ద రహస్యంగా ఆరు అణ్వాయుధ పరీక్షలను నిర్వహించింది.


ఈ క్రమంలోనే ఇక్కడి నుంచి భూగర్భ జలాల ద్వారా రేడియోధార్మికత ప్రస్తుతం స్థానికంగా ఎనిమిది నగరాలు, కౌంటీల్లో విస్తరించి ఉండొచ్చని ట్రాన్సిషనల్ జస్టిస్ వర్కింగ్ గ్రూప్ అధ్యయనం అంచనా వేసింది. ఈ ప్రాంతాల్లో నివసిస్తోన్న పది లక్షలకుపైగా జనాభా.. తాగునీటితో సహా రోజువారీ కార్యకలాపాలకు భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు.


అలాగే, పొరుగున ఉన్న దక్షిణ కొరియా, చైనా, జపాన్‌లకు అక్రమంగా రవాణా అయ్యే వ్యవసాయ, మత్స్య ఉత్పత్తుల కారణంగా అక్కడి ప్రజలూ కొంతమేర ప్రమాదంలో పడొచ్చని నివేదిక హెచ్చరించింది. తాము దిగుమతి చేసుకున్న పుట్టగొడుగుల్లో సాధారణం కంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా రేడియోధార్మిక సీజీయం ఐసోటోపులను గుర్తించామని 2015లోనే దక్షిణ కొరియా ఆహార భద్రతా సంస్థ వెల్లడించింది. వీటిని చైనా ఉత్పత్తులుగా విక్రయించినప్పటికీ.. వాస్తవానికి అవి ఉత్తర కొరియాలో సాగు చేసినవేనని పేర్కొంది.


ఇదిలా ఉండగా, ఈ ఆరోపణలను ఉత్తర కొరియా కొట్టిపారేస్తోంది. అణు పరీక్షల తరువాత ఎటువంటి హానికరమైన పదార్థాలు బయటకు రావడంలేదని వాదిస్తోంది. అయితే, ఇందుకు ఆధారాలను మాత్రం ఇవ్వడం లేదు. 2018లో పుంగేరి అణు పరీక్ష కేంద్రంలోని కొన్ని సొరంగాలను పరిశీలించేందుకు వెళ్లిన విదేశీ జర్నలిస్టుల ‘రేడియేషన్ డిటెక్టర్ల’ను ఉత్తర కొరియా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


‘ఉత్తర కొరియా అణు పరీక్షలు.. అక్కడి ప్రజలను మాత్రమే కాకుండా, పొరుగు దేశాల్లోని పౌరుల ఆరోగ్యానికీ ముప్పు కలిగించగలవని నిరూపించడంలో ఈ నివేదిక కీలకమైంది’ అని మానవహక్కుల సంస్థ చీఫ్, అధ్యయన సహ రచయిత హూబర్ట్ యంగ్ హన్ లీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పుంగేరి పరిసరాల్లోని ప్రజలకు రేడియేషన్ పరీక్షలు నిర్వహించి, అంతర్జాతీయ విచారణ చేపట్టాలని ఆయన కోరారు. 2014లో ఏర్పాటైన ట్రాన్సిషనల్ జస్టిస్ వర్కింగ్ గ్రూప్.. తాజా అధ్యయనం కోసం ఐక్యరాజ్యసమితి, ఇతర ప్రభుత్వ నివేదికలు, అణు, వైద్య నిపుణులు సహా ఉత్తర కొరియా నుంచి తప్పించుకు వచ్చిన పౌరుల సమాచారాన్ని విశ్లేషించింది. అయితే, దీనిపై ఐరాసలోని ఉత్తర కొరియా దౌత్య అధికారులను సంప్రదించగా స్పందించడానికి నిరాకరించారు.


కొరియా ద్వీపకల్పంలో వ్యవహారాలను నిర్వహించే సియోల్ ఏకీకరణ మంత్రిత్వ శాఖ.. ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభం కావడంతో 2018 నుంచి రేడియోధార్మికత పరీక్షించే డిటెక్టర్లను నిలిపివేసింది. కానీ, 2017, 2018లో పుంగేరీ సమీపంలోని ప్రాంతాల నుంచి వచ్చిన 40 మందిలో కనీసం తొమ్మిది మంది అసాధారణతలను చూపించారు. అయితే, దీంతో అణ్వాయుధ పరీక్షలకు నేరుగా సంబంధం ఉన్నట్టు భావించలేమని మంత్రిత్వ శాఖ తెలిపింది. పుంగేరి సమీపం ప్రాంతాల నుంచి గత 17 ఏళ్లలో 880 మంది తప్పించుకుని వచ్చినట్టు నివేదిక పేర్కొంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa