ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పీడు పెంచిన మెగా బ్రదర్స్... పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2023, 08:53 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల్లో మెగా బ్రదర్ నాగబాబు బిజీ అయ్యారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా కొణిదెల నాగబాబు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మరోవైపు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా జనసేనలో యాక్టివ్‌గా మారారు. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ ప్రవాస జనసైనికులు, వీర మహిళల ఆధ్వర్యంలో నిర్వహించనున్న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.


ఈ మేరకు బుధవారం హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు నాగబాబు బయల్దేరారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, బ్రిస్బేన్ తదితర ముఖ్య నగరాల్లో వారం రోజు పాటు జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నాగబాబు పాల్గొని ప్రసంగిస్తారు. అలాగే, ముఖ్య కార్యకర్తలతో ముఖాముఖి సమావేశాల్లో పాల్గొంటారు. జనసేన పార్టీ నాయకులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, సినీ కమెడియన్ హైపర్ ఆది నాగబాబుతో కలిసి ఆస్ట్రేలియాలో జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.


మరోవైపు జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 14వ తేదీన మచిలీపట్నంలో జరుపుకోనున్నారు. ఈ వేడుకల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. తొలుత భారీ ర్యాలీ, అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు దాదాపు 4 లక్షల మంది జనసేన కార్యకర్తలు, మద్దతుదారులు వస్తారని అంచనా వేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సభా వేదిక నుంచే వచ్చే ఎన్నికలకు సంబంధించి మార్గనిర్దేశం చేసే అవకాశం ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa