ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవినీతి కేసులో ముందస్తు బెయిల్ పొందిన బీజేపీ ఎమ్మెల్యేకు సొంతూరులో ఘటన స్వాగతం

national |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2023, 09:26 PM

ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు సైతం నేడు హీరోలుగా చలామణి అవుతున్నారు. అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొని ముందస్తు బెయిల్ పొందిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మదల్ విరూపాక్షప్పకు సొంతూరులో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేవనగెరెలో ఆయనపై బీజేపీ కార్యకర్తలు పూలవర్షం కురిపించి, బాణసంచా పేల్చి రచ్చ రచ్చ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. దేశాన్ని ఉద్దరించిన వాళ్లకు కూడా ఇలాంటి స్వాగతం లభించదురా నాయనా? అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దేశం కోసం ధర్మం కోసం అంటే ఇదేనంటారా? అని ప్రశ్నిస్తున్నారు.


ఇక, బెంగళూరు జలమండలిలో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తోన్న విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మండల్ రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్తా అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఎమ్మెల్యే విరూపాక్షప్ప నివాసాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు మూడు బ్యాగుల్లో రూ.6కోట్ల అక్రమ నగదు, భారీ ఆభరణాలు గుర్తించారు.


కుమారుడు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినా విరూపాక్షప్ప మాత్రం ఇందులో తన పాత్ర లేదని చెప్పడం గమనార్హం. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జంట్స్ లిమిటెడ్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. విరూపాక్షప్పను ఈ కేసులో పోలీసులు ప్రధాన నిందితుడిగా చేర్చారు. దీంతో ఐదు రోజుల పాటు ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. అరెస్టు నుుంచి రక్షణ కల్పించేలా హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. దీంతో అజ్ఞాతం వీడిన ఆయన మంగళవారం దేవనగెరెకు రాగా.. పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. సన్ రూఫ్ కారులో నుంచి విరూపక్షప్ప నిలబడి అభివాదం చేస్తుండగా.. ఆ వాహనానికి ఇరువైపులా భారీగా బీజేపీ కార్యకర్తలు నడవడం వీడియోలో కనిపిస్తోంది. బాణా సంచా పేల్చి హంగామా చేశారు.


కేసు నమోదయిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఎమ్మెల్యే మిస్సింగ్ అంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ యువజన విభాగం కర్ణాటక వ్యాప్తంగా పోస్టర్లు అతికించింది. కర్ణాటక ఎన్నికల ముందు బసవరాజ్ బొమ్మై ప్రభుత్వానికి అవినీతి ఆరోపణలు కాస్త ఇబ్బందికరంగా మారాయి. బిల్డర్లు, కాంట్రాక్టర్లు, ఇతరుల నుంచి అధికార బిజెపి 40 శాతం కమీషన్‌ను వసూలు చేస్తోందన్న ఆరోపణలను హైలైట్ చేయడానికి కాంగ్రెస్ గతేడాది పేసీఎమ్ మాక్ క్యాంపెయిన్ ప్రారంభించింది. శాఖల వారీగా ప్రాజెక్టుల కోసం లంచం చెల్లించాల్సి వస్తోందని ఆరోపిస్తోంది.


తాజాగా, బీజేపీ ఎమ్మెల్యే అవినీతి కేసులో దొరికిపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మనీష్ సిసోడియా ఇంటిపై దాడిలో ఏమీ దొరకలేదు. సీబీఐ, ఈడీలోని అన్ని సెక్షన్లను ప్రయోగించి వారిని అరెస్ట్ చేసింది. మీ పార్టీ ఎమ్మెల్యేకి ఇక్కడ ఇంత నగదు దొరికినా అరెస్టు చేయలేదా? ఇప్పుడు అవినీతిపై పోరాటం గురించి మాట్లాడకండి’ అని ట్వీట్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa