ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిద్రమత్తులో జారుకొన్న డ్రైవర్... తుని వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 19, 2023, 03:16 PM

కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు విజయవాడ నుంచి పార్వతీపురం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారిలో 15 మందికి గాయాలు కాగా.. సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని.. స్వల్పగాయాలే అయ్యాయని వైద్యులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నిద్ర మత్తులో బస్సును నడుపుతున్న డ్రైవర్.. అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఎక్కించాడు. దీంతో బస్సు ఉన్నట్లుండి బోల్తా పడిపోయింది.


బస్సు డివైడర్ ఎక్కే సమయంలో వేగం తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. బోల్తా పడిన వెంటనే బస్సు ఆగిపోయింది. వేగం ఎక్కువగా ఉండి ఉంటే పల్టీలు కొట్టేదని ప్రయాణికులు చెబుతున్నారు. అదే జరిగితే ప్రాణ నష్టం ఉండేదని అంటున్నారు. అదృష్టవశాత్తు బస్సు తక్కువ వేగంతో ప్రయాణిస్తుండటంతో ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa