ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న విద్యాదీవెన పథకంకు రూ.698.66 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 19, 2023, 03:17 PM

జగనన్న విద్యాదీవెన పథకంకు  నిధులను ఆదివారం సీఎం జగన్ విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరులో జరిగిన బహిరంగ సభలో కంప్యూటర్ బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. 2022 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి 9.88 లక్షల విద్యార్థులకు రూ.698.66 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. నేరుగా తల్లుల బ్యాంకు అకౌంట్‌లో నగదు జమ చేశామని, పేదలు బాగుండాలనే నవరత్నాలు ప్రవేశపెట్టామని తెలిపారు.


'పిల్లలకు మనం ఇచ్చే చెరగని ఆస్తి చదువే ఒక్కటే. ఒక మనిషి పేదరికం నుంచి బయటపడాలంటే చదువుతోనే సాధ్యం. ఒక కుటుంబం తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది. ఒక మనిషి జీవన ప్రయాణం నిర్దేశించేది చదువే. చదువులకు పేదరికం అడ్డు కాకూడదు. ఫీజులు కట్టలేక చదువులు మానివేసే పరిస్థితి రాకూడదు. కాలేజీ ఫీజులు ఎంతైనా సరే పూర్తి బాధ్యత మీ జగనన్నదే. దేశంలో విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాలు ఎక్కడా లేవు' అని జగన్ తెలిపారు.


'గత ప్రభుత్వంలో కాలేజీ ఫీజుల బకాయిలు పెట్టేవారు. గత ప్రభుత్వంలో అరకొర ఫీజులు మాత్రమే ఇచ్చేవారు. ఆ డబ్బులు కూడా ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. చంద్రబాబు హయాంలోని బకాయిలను కూడా చిరునవ్వుతో చెల్లించాం. ఇప్పుడు లాంచాలు, వివక్ష లేకుండా నేరుగా రూ.698.68 కోట్లు జమ చేస్తున్నాం. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా రూ.9947 కోట్లు అందించాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా 27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుంది. ఫీజులు కట్టలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తెచ్చాం. విద్యార్థులు సత్య నాదెళ్లలా తయారుకావాలి. టీడీపీ హయాంలో ఇంటర్ తర్వాత డ్రాపౌట్స్ సంఖ్య 80వేలకుపైగా ఉండేది. 2022-23 కల్లా ఆ సంఖ్య 22 వేలకు తగ్గిపోయింది. అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద, నాడు-నేడు వంటి స్కీమ్‌లు అమలు చేస్తున్నాం' అని జగన్ చెప్పారు.


'ప్రతి మూడు నెలలకు ఒకసారి పూర్తి ఫీజులు తల్లుల అకౌంట్లలో వేస్తున్నాం. ఫీజుల ఖర్చుతో పాటు వసతి ఖర్చు కూడా ఇస్తున్నాం. గవర్నమెంట్ స్కూళ్లలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తున్నాం. ప్రతి తరగతి గదిని డిజిటలైజ్ చేస్తున్నాం. ప్రభుత్వ బడులు, కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడేలా చేస్తున్నాం. కొత్తగా 14 డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చాం. కొత్తగా 17 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. రెండేళ్లు టైమ్ ఇవ్వండి.. ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ స్కూళ్లను తయారుచేస్తాం' అని జగన్ వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa