ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ ఖాతాలో మూడు స్థానంలో... సంబరాల్లో మునిగి తేలిన తెలుగు తమ్ముళ్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 19, 2023, 06:16 PM

గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీడీపీలో నూతనోత్సాహం నింపాయి. వచ్చే ఎన్నికల్లో విజయంపై ధీమాను పెంచుతున్నాయి.  ఇదిలావుంటే మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్‌‌లో తీవ్ర ఉత్కంఠ రేపిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అదరగొట్టింది. ఎవరూ ఊహించనివిధంగా మూడింటికి మూడు స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. టపాసులు కాల్చుతూ, స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందగా.. పశ్చిమ రాయలసీమ స్థానంలోనూ ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై టీడీపీ మద్దతు ఇచ్చిన భూమి రెడ్డి రామగోపాలరెడ్డి 7543 ఓట్ల తేడాతో గెలుపొందారు.


49 మంది అభ్యర్థులు పోటీ పడ్డ ఈ స్థానంలో ప్రతి రౌండ్‌లోనూ ఫలితం తీవ్ర ఉత్కంఠ రేపింది. టీడీపీ, వైసీపీ బలపరిచిన అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కొనసాగింది. అధికారికంగా ఫలితాలను ప్రకటించడానికి ముందే తెలుగు తమ్ముళ్ల సంబరాలు ప్రారంభమయ్యాయి. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో బాణాసంచా కాలుస్తూ గెలుపు సంబరాలు నిర్వహించుకుంటున్నారు.


ఇదిలా ఉండగా.. వైఎస్సార్‌సీపీ మాత్రం ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. రీకౌంటింగ్ నిర్వహించాలంటూ అభ్యర్థి రవీంద్రారెడ్డి కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్ నాగలక్ష్మి జోక్యం చేసుకొని ఆయనకు నచ్చజెప్పారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఎలాంటి ఆందోళనలు చేయవద్దని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.


మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి సరైన మెజార్టీ రాకపోవడంతో.. ఎలిమినేషన్ ప్రక్రియ నిర్వహించామని, 7543 ఓట్ల తేడాతో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలిచారని రిటర్నింగ్ అధికారి ఎస్ నాగలక్ష్మి ప్రకటించారు. ‘టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి 1,09,781 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రా రెడ్డికి 1,02,238 ఓట్లు వచ్చాయి. అధికారికంగా ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన తర్వాత భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలుపుని అధికారికంగా ధ్రువీకరరిస్తాం’ అని ఆమె అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa