ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి ప్రాంతంలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ జారీ చేసిన ఏపీ సర్కార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 21, 2023, 09:25 PM

అమరావతి ప్రాంతంలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేస్తూ వైసీపీ సర్కార్ గెజిట్‌ జారీ చేసింది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో దాదాపు 900 ఎకరాలను ఆర్‌-5 జోన్‌ పరిధిలోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుపై 2022 అక్టోబరులోనే ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయం సరికాదని.. జీవోను వ్యతిరేకిస్తూ అప్పట్లో రైతులు కోర్టుకు వెళ్లారు.


అప్పుడు రైతుల అభిప్రాయాలు తీసుకోలేదని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో అధికారులు రాజధాని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కొన్ని గ్రామాల రైతులు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుపై గెజిట్‌ విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. పేద వర్గాల ఇళ్ల కోసం భూములు కేటాయిస్తున్నట్టు గెజిట్‌లో స్పష్టం చేసింది. అయితే.. ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి కోర్టులో సవాల్ చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.


అమరావతి బృహత్‌ ప్రణాళిక ప్రకారం.. 4 నివాస జోన్లు ఉండేవి. ఆర్‌-1 అంటే.. ప్రస్తుత గ్రామాలు, ఆర్‌-2 అంటే తక్కువ సాంద్రత గృహాలు, ఆర్‌-3 అంటే తక్కువ నుంచి మధ్యస్థాయి సాంద్రత కలిగిన గృహాలు, ఆర్‌-4 అంటే హైడెన్సిటీ జోన్‌ పేర్లతో 4 రకాల నివాస జోన్లు ఉండేవి. తాజాగా.. కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అందులోని 900.97 ఎకరాలను ఆర్‌-5 జోన్‌గా ఏర్పాటు చేస్తూ గెజిట్‌ జారీ చేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa