వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిజాయితీపరుడైన విచారణ అధికారిని మార్చాలనే ఒత్తిడి చేశారనే ప్రచారం జరుగుతోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు. వివేకా హత్య కేసు విచారణ అధికారిని మార్చాలన్న కొందరి కోరిక నెరవేరదన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను తొలుత దీపక్ గౌర్ అనే అధికారి చేపట్టగా.. ఆ తరువాత రామ్ సింగ్కు విచారణ బాధ్యతలు అప్పగించారన్నారు. రామ్ సింగ్ను ఎలాగైనా ఈ కేసు నుంచి తప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారని.. ఆయనపై కేసులు కూడా నమోదు చేశారన్నారు. ఈ కేసు త్వరితగతిన విచారణ జరగాలంటే సీబీఐ తుది చార్జిషీట్ ను దాఖలు చేయాల్సిన అవసరం
ఉందన్నారు. ఈ కేసులో సీబీఐ నివేదికను సీల్డ్ కవర్లో అందజేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఒకవైపు విచారణ జరుగుతుంటే.. అదే అంశంపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఏదో రకంగా గత ప్రభుత్వంపై బురద చల్లేందుకు నోటికి వచ్చినట్లు మాట్లాడారని, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అసలు అవినీతి అన్నది జరగకపోయినప్పటికీ.. ఏదో జరిగిపోయినట్లు మసి పూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 371 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసి.. 3 లక్షల 80 వేల మందికి పైగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణను ఇచ్చేందుకు సీమెన్స్ అనే బహుళ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుందన్నారు.
ఈ లెక్కన ప్రతి విద్యార్థిపై 9,000 రూపాయలను మాత్రమే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. అమ్మ ఒడి, విద్యా దీవెన వంటి పథకాల ద్వారా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు కంటే.. గత ప్రభుత్వం చేసింది చాలా సాధారణమైన ఖర్చు అన్నారు. నైపుణ్య శిక్షణ తరగతుల ద్వారా రాష్ట్రంలోని 3 లక్షల 80 వేల మంది విద్యార్థులు శిక్షణ పొంది, సర్టిఫికెట్లను అందుకున్నారని, అవేమీ దొంగ సర్టిఫికెట్లు కాదన్నారు. తాను ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సమర్ధించడానికో, గత ప్రభుత్వానికి మద్దతు తెలియజేయడానికో మాట్లాడడం లేదన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు మాత్రమే మాట్లాడుతున్నాను అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తర్వాత చంద్రబాబుపై బురద చల్లేందుకు ఇలా అసెంబ్లీలో నైపుణ్య శిక్షణ తరగతుల్లో కుంభకోణం జరిగిందని మాట్లాడుతున్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలలో భాగంగా స్కూల్ పిల్లలకు రాగి జావ అందజేసే కార్యక్రమానికి ఐదు కోట్లతో జాతీయ, ప్రాంతీయ దినపత్రికలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ప్రచారం చేసుకోవడం అవసరమా అని ప్రశ్నించారు రఘురామ. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి 60% నిధులను కేటాయిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 40% నిధులను మాత్రమే ఖర్చు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా సొమ్మును సత్య సాయి ట్రస్ట్ తన వంతుగా రూ.86 కోట్లు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు. అయితే పత్రికలకు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లలో ప్రధానమంత్రి మోదీ ఫోటోతో పాటూ రూ. 86 కోట్లు ఖర్చు చేస్తున్న సత్యసాయి ఫొటోలు లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa