ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి నామినేట్ అయిన భారతీయ అమెరికన్ అజయ్ బంగాకు కోవిడ్ నిర్దారణ అయ్యింది. మూడు వారాల ప్రపంచ పర్యటనలో భాగంగా మార్చి 23న ఢిల్లీకి చేరుకున్న అజయ్ బంగాకు రొటీన్ పరీక్షల్లో భాగంగా కరోనా పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం ఆయన ఐసోలేషన్లో ఉన్నారని అమెరికా ట్రెజరీ విభాగం గురువారం వెల్లడించింది. గత కొద్ది రోజులుగా దేశంలో ఇన్ఫ్లూయెంజాతో పాటు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. గడచిన 24 గంటల్లో దేశంలో 1,300కిపైగా కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు రావడం 140 రోజుల తర్వాత ఇదే మొదటిసారి.
బంగా మూడు వారాల ప్రపంచ పర్యటనలో ఢిల్లీ సందర్శన చివరిది. ఆఫ్రికా నుంచి ప్రారంభమైన ఆయన పర్యటన యూరప్, లాటిన్ అమెరికాల మీదుగా ఆసియాకు చేరుకుంది. ‘‘రొటీన్ టెస్టింగ్లో భాగంగా అజయ్ బంగాకు కోవిడ్ పాజిటివ్గా వచ్చింది కానీ, ఎటువంటి లక్షణాలు లేవు.. స్థానిక నిబంధనలు ప్రకారం ఆయన ఐసోలేషన్లో క్వారంటైన్ ఉన్నారు’’అని డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ ఓ ప్రకటన చేసింది.
భారత్ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో అజయ్ బంగా భేటీ కావాల్సి ఉందని పేర్కొంది. బంగాను ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి నామినేట్ చేస్తున్నట్టు అమెరికా ప్రకటించిన వెంటనే భారత్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఆమోదించింది. తర్వాత బంగ్లాదేశ్, కోట్ డి ఐవోయిర్, కొలంబియా, ఈజిప్ట్, ఫ్రాన్స్, జర్మనీ, ఘనా, ఇటలీ, జపాన్, కెన్యా, సౌదీ అరేబియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, యునైటెడ్ కింగ్డమ్ సహా పలు దేశాలు ఆయనకు మద్దతు ప్రకటించాయి. ప్రపంచ పర్యటనలో భాగంగా అనేక మంది ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామిక దిగ్గజాలు, సామాన్య పౌరులను బంగా కలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు న్యాయవాదులు, విద్యావేత్తలు, నిపుణులు, నోబెల్ గ్రహీతలు, మాజీ ప్రభుత్వ అధికారుల నుంచి మద్దతు పెరుగుతోంది.
ఒకవేళ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఎన్నికైతే అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పని చేయడం, పెట్టుబడులను సమీకరించడానికి, దీర్ఘకాలిక సవాళ్లను ఎదుర్కొనేందుకు చర్య తీసుకోవడానికి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను రూపొందించడంలో బంగా అనుభవం ఉపయోగపడుతుంది. గతంలో మాస్టర్ కార్డును డిజిటల్ ఎకానమీలోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి నామినేషన్ ప్రక్రియ మార్చి 29 వరకు ఉంది. అనంతరం బోర్డులోని డైరెక్టర్లు ఎవరివైపు మొగ్గుచూపితే వారే అధ్యక్షుడవుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa