కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీ కీలక నేతగా ఉన్న పరుచూరి సుభాష్ చంద్ర బోస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ప్రజలకు న్యాయం జరగడం లేదని.. ప్రభుత్వ విధానాలతో విసిగి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో పలుకుబడి ఉన్న నేతగా ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ వైఎస్ జగన్తో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలో పాల్గొన్నారు.. ముఖ్య అనుచరుడిగా గుర్తింపు ఉంది. సుభాష్ చంద్రబోస్తో పాటు ఆయన అనుచరులు, కార్యకర్తలు కూడా పార్టీని వీడనున్నారు.
తాను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని.. ఆ తర్వాత వైఎస్సార్సీపీలోకి వచ్చానన్నారు. గతంలో కొందరు నేతలు తనను జగన్ పార్టీలోకి వెళ్లొద్దని చెప్పినా వినలేదని.. వైఎస్ రాజశేఖరరెడ్డిలాగే జగన్ కూడా పాలన అందిస్తారని నమ్మాను అన్నారు. కష్ట కాలంలో వయోభారంతో ఉన్నప్పటికీ తాను జగన్మోహన్ రెడ్డి వెంట 3,649 కిలోమీటర్లు పాదయాత్రలో పాల్గొన్నాను అన్నారు. కానీ రాష్ట్రంలో పరిణామాలతో పాటూ ప్రభుత్వ పాలన నచ్చలేదని.. అందుకే పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ప్రజావేదిక కూల్చటం, రాజధాని తరలింపు వంటి నిర్ణయాలు తీసుకున్నప్పటి నుంచే తనకు బాధ కలిగిందన్నారు. అప్పటి నుంచి తాను పార్టీకి కాస్త దూరంగా ఉంటున్నాను అన్నారు.
ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని.. రాజశేఖర్ రెడ్డి బాటలో జగన్ పాలన సాగుతుందని భావించానని.. కానీ అలా జరగలేదన్నారు. ప్రచార ఆర్భాటమే తప్ప అభివృద్ధి లేదని.. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఇస్తోంది ఎంత అని ప్రశ్నించారు. నిత్యావసర వస్తువులతో పాటూ మిగిలిన ధరలు పెరిగాయన్నారు. పంట పండించిన రైతు ధాన్యం విక్రయించే పరిస్థితి లేదన్నారు.
అలాగే సంక్షేమం పేరుతో బడుగు, బలహీనవర్గాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు సుభాష్ చంద్రబోస్. పేరుకు 30 లక్షల ఇళ్లు ఇచ్చామని చెబుతున్నారని.. గృహ నిర్మాణాలకు ప్రభుత్వం అందజేసే రూ.1.8 లక్షలు చాలక లబ్ధిదారులు అప్పుల పాలవుతున్నారన్నారు. వర్షాలు కురిస్తే రోడ్లు బురద, గుంతల మయంగా ఉండి నడవలేని పరిస్థితి ఉందన్నారు.
అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నవారిపై దాడులు చేస్తున్నారని.. అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ప్రజా, ఉద్యోగ వ్యతిరేక విధానాలను నివారించాలంటే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఉందన్నారు. ఒకటి, రెండ్రోజుల్లో తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సలహాల మేరకు ఏ పార్టీలో చేరేది స్పష్టతనిస్తానని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa