ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వ పాఠశాలల్లో బోధన పర్యవేక్షణ పేరుతో ఉపాధ్యాయులపై అధికారులు దాడులు చేస్తూ మానసిక వేదనకు గురిచేస్తున్నారు’ అని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాఫ్టో) ఆరోపించింది. విజయవాడలోని యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఫ్యాప్టో నేతలు బుధవారం మీడియాతో మాట్లాడారు. ఫ్యాప్టో అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏడాది కాలంగా ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాలకు ఉపయోగిస్తూ రికార్డుల తయారీ, యాప్ల అప్లోడ్ వంటి కార్యక్రమాలతో పాఠశాలల్లో బోధన జరగనివ్వలేదన్నారు. విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ప్రకాశ్ ఉపాధ్యాయులను అవమానించడం, వేధించడమే పనిగా పర్యవేక్షణ కార్యక్రమాలను రూపొందించారన్నారు. ఉపాధ్యాయుల్ని వంద శాతం విద్యాబోధనకే పరిమితం చేస్తే ఫలితాలు వస్తాయని, బోధన చేసే పరిస్థితి లేకుండా చేసి నూరు శాతం ఫలితాలు సాధించాలని ఒత్తిడి చేయడం తగదన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించలేదనే పేరుతో షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్లు చేయడం తగదని, ప్రభుత్వం వైఖరి మార్చుకుని వేధింపులు ఆపకపోతే ఐక్య పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ..... విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యవేక్షణ సమయంలో ఉపాధ్యాయులను విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఎదుట హేళన చేస్తున్నారని చెప్పారు. పర్యవేక్షణకు ఫ్యాప్టో వ్యతిరేకం కాదని, పాఠశాలల్లో భౌతిక పరిస్థితులను గమనించకుండా ఉపాధ్యాయులను దోషులుగా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమావేశంలో ఫ్యాప్టో కోచైర్మన్ కె.మోహనరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎస్.చిరంజీవి, కోశాధికారి చింతల సుబ్బారావు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa