ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆత్మహత్యకి పాల్పడిన ప్రేమజంట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 16, 2023, 01:07 PM

అనంతపురం జిల్లాకు చెందిన ప్రేమ జంట అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వివాహానికి కులాలు అడ్డురావడంతో ఇద్దరూ అటవీ ప్రాంతంలో ఉరి వేసుకున్నారు. కూడేరు మండలం ఉదిరిపికొండ గ్రామానికి చెందిన ముత్తులూరి ధనుంజయనాయుడి కుమారుడు ఎం.వెంకటనాయుడు (27) వైజాగ్‌లో ఓ ఫార్మసీ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అదే ఊరికి చెందిన రమణ కుమార్తె వి.వినీషా (17) కర్నూలులో ఎంసెట్‌కు ప్రిపేర్‌ అవుతోంది. వీరిద్దరూ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం ఇరువురి కుటుంబాల్లో తెలియడంతో పలుమార్లు ఘర్షణపడ్డారు. తల్లిదండ్రులు మందలించినా ఇద్దరూ విడిపోలేదు. ఈ క్రమంలో రెండేళ్ల కిందట ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. పోలీసులు వెతికి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వినీషా మైనర్‌ కావడంతో కూడేరు పోలీస్‌ స్టేషనలో వెంకటనాయుడిపై పోక్సో కేసు నమోదైంది. ఇటీవల గ్రామంలో జరిగిన గంగజాతరకు వెంకటనాయుడు, వినీషా వెళ్లారు. కలిసి మాట్లాడుకుని, దూరంగా వెళ్లిపోయు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 9న ఇంటి నుంచి వెళ్లిపోయారు. ద్విచక్రవాహనంలో నేరుగా తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడ వివాహం చేసుకున్నారు. అనంతరం మదనపల్లె మండలం కొత్తవారిపల్లె పంచాయతీ అబ్బుగొంది అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. దారిలో ద్విచక్ర వాహనం నిలిపి ఉంచి అడవిలోకి నడిచి వెళ్లారు. ఓ బండ వద్ద కూర్చుని స్వామివారి ప్రసాదం తిని, జ్యూస్‌ తాగారు. అనంతరం బండ ఆనుకుని ఉన్న ఓ చెట్టుకు చున్నీలతో ఉరి వేసుకున్నారు. మృతదేహాలు కుళ్లిపోయి దుర్వాసన వస్తుండడాన్ని గుర్తించిన స్థానికులు ఆదివారం రాత్రి తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. టూవీలర్‌ నంబర్‌ ఆధారంగా అనంత వాసులుగా పోలీసులు నిర్ధారించారు. ఇద్దరి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సీఐ సత్యనారాయణ వారి నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. మృతదేహాల స్థితిని చూసి నాలుగైదు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించేవీల్లేక.. సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించడంతో వారు స్వగ్రామానికి తరలించారు. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ప్రేమకు కులం అడ్డురావడం, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నా.. విడదీస్తారనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూడేరు పోలీ్‌సస్టేషనలో ఇద్దరిపై అదృశ్యం కేసు నమోదైంది. ఓవైపు పోలీసులు, మరోవైపు కుటుంబ సభ్యులు గాలిస్తుండగానే మరణవార్త విన్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa