రాష్ట్రంలోని కొన్ని మీడియా సంస్థలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎంపీ అవినాశ్ రెడ్డి వ్యవహారంలో ఎల్లో మీడియా రోత రాతలు రాస్తోందని, అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ‘‘కుటుంబాన్ని పలచన చేస్తున్నారు. తల్లికి బాగాలేదంటే డ్రామాలని అంటారు. ఇలా చేస్తే కడుపుమండకుండా ఉంటుందా? మీ మీద కూడా ఇలానే రాస్తే ఒప్పుకుంటారా?’’ అని నిలదీశారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అవినాశ్ రెడ్డి ఇప్పటిదాకా ఆరు సార్లు సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. ఆయన సహకరిస్తున్నారు. ఎక్కడికీ పారిపోలేదు. ఆయన తల్లికి బాగాలేదు. తండ్రి జైలులో ఉన్నారు. అందుకే విచారణకు రాలేనని లేఖ రాశారు. ఈ విషయంలో ఏం జరిగినా.. అది సీబీఐకి, ఆయనకు మధ్య జరిగే వ్యవహారం. పోలీసులతో మాట్లాడి సీబీఐ అధికారులు వాళ్ల పని వాళ్లు చూసుకుంటారు’’ అని తెలిపారు.
‘‘కానీ ఎల్లో మీడియా మాత్రం.. పారామిలిటరీ ఫోర్సెస్ వస్తున్నాయని రాస్తారు. ఎక్కడొస్తున్నాయి బలగాలు? వస్తున్నాయని నువ్వే రాస్తావు? మళ్లీ బలగాలు రాకుండా ఏదో చేశారనీ రాస్తావు. ఏదో భయంకరమైనది జరుగుతున్నట్లు రాసి.. మళ్లీ ఏమీ జరగలేదని రాస్తారు. కథ మీరు సృష్టిస్తారు.. ఆరోపణలు మీరే చేస్తారు’’ అని అన్నారు.
‘‘వైఎస్సార్ సీపీకి ఎవరూ లేరనుకుంటున్నారా? కార్యకర్తలు, అభిమానులు కోట్ల మంది ఉన్నారు. ఏదో జరిగిపోతోంది.. కొంపలు అంటుకుపోతున్నాయి అని రాస్తే ఆసుపత్రి దగ్గరికి రాకుండా ఉంటారా? పార్టీ అభిమనులు, కుటుంబ అభిమానులు వస్తారు. బాధనో, ఆవేశమో కలిగి, ఏమిటీ అన్యాయమని వాళ్లు వస్తారు’’ అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa