ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.20 వేల కోట్ల వ్యయంతో కొత్త పార్లమెంట్,,,,సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ దక్కించుకున్న టాటా

national |  Suryaa Desk  | Published : Sun, May 28, 2023, 09:19 PM

భవిష్యత్తులో ఎంపీల సంఖ్య పెరుగుతుందని, 100 ఏళ్ల కిందటి ప్రస్తుత భవనంలో వారు కూర్చోవడానికి స్థలం సరిపోవడం లేదని సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కింద కొత్త పార్లమెంటు భవనం నిర్మించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు దాదాపు రూ. 20 వేల కోట్లు ఖర్చుచేశారు. వాస్తవానికి ఢిల్లీలోని రాజ్‌పథ్‌కు సమీపంలో ఉన్న ప్రాంతాన్ని సెంట్రల్ విస్టా అని పిలుస్తారు. ఇందులో రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ సమీపంలో ఉన్న ప్రిన్సెస్ పార్క్ ప్రాంతం కూడా ఉంది. రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, ఉప-రాష్ట్రపతి నివాసం కూడా దీని పరిధిలోకి వస్తాయి.


అత్యాధునిక సౌకర్యాలు, సకల హంగులతో నిర్మించిన ఈ పార్లమెంటు భవంతిని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా జరగాల్సిన ఈ కార్యక్రమం జరగడం లేదని చెప్పి 20 విపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని ఇప్పటికే నిర్ణయించాయి. అయితే, అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. రాజధాని ఢిల్లీని నియంత్రిత ప్రాంతంగా ప్రకటించి, ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.


ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌ తివాచీలు, త్రిపుర వెదురుతో సిద్ధం చేసిన గచ్చు, రాజస్థాన్‌లో రూపుదిద్దుకున్న శిలాకృతులు.. ఇలా దేశంలో భిన్న సంస్కృతుల మేళవింపుగా కొత్త భవనాన్ని తీర్చిదిద్దారు. స్వాతంత్రం అనంతరం బ్రిటిషర్ల నుంచి అధికారం బదలాయింపునకు చిహ్నంగా తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్వీకరించిన చోళుల కాలం నాటి‘రాజదండం’ (సెంగోల్‌)ను స్పీకర్‌ స్థానానికి సమీపంలో ఉంచుతారు. అలాగే, ప్రత్యేకంగా రూపొందించిన రూ.75 నాణేన్ని విడుదల చేస్తారు.


టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ నిర్మించిన కొత్త భవనంలో భారీస్థాయి ‘కాన్‌స్టిట్యూషన్‌ హాల్‌’, ఎంపీల కోసం ఒక లాంజ్‌, గ్రంథాలయం, కమిటీ హాళ్లు, విశాలమైన పార్కింగ్‌ ఏర్పాట్లు ఉంటాయి. త్రికోణాకారంలో నాలుగంతస్తుల్లో నిర్మించిన భవనం మొత్తం వైశాల్యం 64,500 చదరపు మీటర్లు. వీఐపీలు, ఎంపీలు, సందర్శకులకు వేర్వేరు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు.


ఇక, భవన నిర్మాణానికి వినియోగించిన టేకును నాగ్‌పూర్ నుంచి, ఫ్లోరింగ్ కోసం రాజస్థాన్‌లోని సర్‌మధుర నుంచి ఎర్ర చలువరాయి, అంబాజీ నుంచి తెల్ల చలువరాయి, కేసరియా ఆకుపచ్చరాయిని ఉదయ్‌పుర్‌ నుంచి, ఎర్ర గ్రానైట్‌ను అజ్‌మేర్‌ సమీపంలోని లఖా నుంచి.. ఫర్నిచర్‌ను ముంబయి నుంచి రప్పించారు. జాతీయ చిహ్నం కోసం సామగ్రిని ఔరంగాబాద్‌ నుంచి, ఉభయసభల్లో భారీ గోడలపై అశోక చక్రం కోసం ఇండోర్ నుంచి సామగ్రి తీసుకువచ్చారు. కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ ప్రాజెక్ట్ బ్లూప్రింట్‌ను గుజరాత్‌లోని ఆర్కిటెక్చర్ సంస్థ హెచ్‌సీపీ డిజైన్స్ రూపొందించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa