ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మధ్యాహ్నం భోజనంలో పాము... వందమందికి అస్వస్థత

national |  Suryaa Desk  | Published : Sun, May 28, 2023, 09:21 PM

పాము పడిన మధ్యాహ్న భోజనం తిని 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలకలం రేపిన ఈ ఘటన బిహార్‌లోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. అరారియా జిల్లా ఫర్‌బిస్‌గంజ్ సబ్-డివిజన్ పరిధిలోని జోగ్‌బాని నగర్ సెకండరీ స్కూల్‌లో జరిగిన ఈ ఘటనలో బాధిత విద్యార్థులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నారుల ఆరోగ్యం మెరుగ్గానే ఉందని అధికారులు పేర్కొన్నారు. జోగ్‌బనీ నగర్ 21 వార్డులోని అమునా మిడిల్ స్కూల్‌‌లో విద్యార్థుల కోసం సిద్ధం చేసిన మధ్యాహ్న భోజనంలో చనిపోయిన పాము కనిపించింది.


మధ్యాహ్న భోజనం తిన్న చిన్నారుల్లో చాలామంది వాంతులు చేసుకుని, అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అయితే, ఆ ఆహారం స్కూల్‌లో వండలేదని, ఓ కాంట్రాక్టర్ తీసుకొచ్చినట్టు సిబ్బంది చెబుతున్నారు. మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్థులంతా అస్వస్థతకు గురికావడంతో వారిని ఫర్‌బిస్‌గంజ్ సబ్-డివిజినల్ ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నారని స్థానిక డీఈఓ రాజ్‌కుమార్ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన ఆయన... బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.


ఓ స్వచ్ఛంద సంస్థకు మధ్యాహ్న భోజన బాధ్యతలను అప్పగించామని, ఘటనలో వారి పాత్ర ఉన్నట్టు తెలితే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. విద్యార్ధులకు ఆహారం వడ్డిస్తుండగా.. అందులో పాము ఉండటం ఓ చిన్నారి చూసి అందర్నీ అప్రమత్తం చేశారు... అప్పటికే 100 మంది విద్యార్థులు తిన్నారు. వాంతులు చేసుకున్న విద్యార్థులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటన గురించి తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న డీఈఓ, ఇతర అధికారులు.. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు.


పిల్లలకు నాణ్యతలేని ఆహారం తీసుకొస్తున్నారని, గతంలో చాలాసార్లు ఎన్‌జీఓకు ఫిర్యాదు చేసినా.. వారు పట్టించుకోలేదని పాఠశాల సిబ్బంది తెలిపారు. అయితే, ఆహారంలో చనిపోయిన పాము ఎలా పడింతో తమకు తెలియదని సదరు ఎన్‌జీఓ అధికారి ఒకరు చెప్పడం గమనార్హం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa