ఇటీవల మనదేశంలోని జరిగిన ఒడిశా రైలు ప్రమాదం యావత్తు ప్రపంచాన్ని కుదిపేసిన విషయం తెలిసింది. ఇదిలావుంటే ఒడిశా లో తీవ్ర విషాదం నింపిన రైలు ప్రమాద ఘటన నుంచి బాలాసోర్ జిల్లా బహానగా గ్రామస్థులు తేరుకోలేకపోతున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ 10వ రోజు నిర్వహించారు. ఆదివారం (జూన్ 11) నిర్వహించిన క్రతువులో 100 మంది గ్రామస్థులు గుండు చేయించుకున్నారు. అనంతరం స్థానిక పుష్కరిణిలో స్నానాలు చేసి, కర్మకాండలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కర్మకాండలు నిర్వహించిన తర్వాత సామూహిక భోజనాలు ఏర్పాటు చేశారు. సోమవారం, మంగళవారం విశ్వశాంతి యజ్ఞం, సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు. ఇలాంటి ప్రమాదం మరో చోట జరగకూడదని భగవంతుడికి ప్రార్థించి ఈ కార్యక్రమాన్ని తలపెట్టామని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమాలకు అందరూ ఆహ్వానితులేనని వారు చెప్పారు.
బాలాసోర్ (బాలేశ్వర్) జిల్లా బహానగా రైల్వే స్టేషన్ సమీపంలో జూన్ 2న కోరమాండల్ ఎక్స్ప్రెస్ సహా మూడు రైళ్లు ఢీకొన్న ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో 288 మంది మరణించగా.. 1000 మందికి పైగా గాయపడ్డారు. తమ గ్రామ సమీపంలో ఇంతటి ఘోర ప్రమాదం జరగడాన్ని బహానగా వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు.ప్రమాద జరగగానే గ్రామానికి చెందిన సుమారు 150 మంది తక్షణమే స్పందించి సాయం చేశారు. ప్రమాదం జరిగిన అర గంట లోపే స్థానికులు అక్కడికి చేరుకున్నారని ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన వారు చెప్పారు. బహానగా గ్రామస్థులే లేకపోతే.. బోగీల్లో నలిగిపోయి ఇంకా చాలా మంది చనిపోయి ఉండేవారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రమాదంలో మృతి చెందిన వారు తమ కుటుంబసభ్యులు కాకపోయినా.. తమవారినే కోల్పోయినట్లు బాధ కలుగుతోందని స్థానికులు చెప్పారు. బహానగా పాఠశాల పక్కన ఉన్న మైదానంలో విశ్వశాంతి యజ్ఞం, సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అందరూ కలిసి భోజనాలు చేశారు.‘వారిని రక్షించేందుకు ప్రయత్నించినా, వారి ప్రాణాలను కాపాడలేకపోయాం. మేము వారి కుటుంబసభ్యులం కాకపోవచ్చు. కానీ, వారిని కోల్పోయిన బాధ మమ్మల్ని వేధిస్తోంది. మా కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు మేము ఎలాంటి కర్మలను నిర్వహిస్తామో.. ప్రమాదంలో మరణించిన వారికి కూడా అదే రీతిలో కర్మలను నిర్వహించాలని నిర్ణయించుకున్నాం’ అని సంతోష్ సమాల్ అని స్థానికుడు చెప్పారు. మరోవైపు.. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఇంకా 81 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి, ఆ ఫలితాల ఆధారంగా మృతదేహాలను అప్పగిస్తున్నారు. కొన్ని మృతదేహాల కోసం నేటికీ ఎవరూ రాకపోవడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa