కొత్తదనం ఎక్కడ కనిపించినా వాటిని యావత్తు సమాజంకు తెలియ జేయడంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ముందుంటారు. ఇదిలావుంటే ఆనంద్ మహీంద్రా తన దృష్టికి వచ్చిన ఓ ఇంజనీరింగ్ అద్భుతాన్ని ట్విట్టర్ ద్వారా కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. నెదర్లాండ్స్ లోని రివర్స్ బ్రిడ్జిగా పేరొందిన వెలువెమీర్ అక్వెడక్ట్ బ్రిడ్జ్ వీడియో క్లిప్ ను ట్వట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియోను గమనిస్తే.. నదిపై రహదారి ఏర్పాటు చేయగా.. మధ్యలో నీరు వెళ్లేందుకు వీలుగా రహదారిని బ్రేక్ చేసి ఉండడం కనిపిస్తుంది. అలా బ్రేక్ చేసినప్పటికీ వాహనాలు ఆగకుండా దూసుకుపోతుండడాన్ని గమనించొచ్చు. కాకపోతే అలా కట్ అయ్యే చోట రోడ్డు నీటి కింద నుంచి వెళ్లేలా డిజైన్ చేశారు. అందుకే దీన్ని నేటి రోజుల్లో ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతంగా వర్ణిస్తారు.
నీటిపై బోట్లు వెళ్లడానికి రహదారి మధ్యలో ఈ డిజైన్ ఏర్పాటు చేశారు. అక్కడ రహదారి నీటి కింది భాగం నుంచి వెళుతుంది. వీడియో చూస్తుంటే వాహనాలు వేగంగా వెళుతూ, మధ్యలో ఇలా కట్ అయిన చోట అదృశ్యమైన మరోవైపు ప్రత్యక్షమవుతున్నట్టు కనిపిస్తుంది. భారత్ లోనూ ఇలాంటి నిర్మాణాలు చేయగలమా? అంటూ ఆనంద్ మహీంద్రా కేంద్ర మంత్రి గడ్కరీని ప్రశ్నించారు. ఈ తరహా మౌలిక సదుపాయాలు మన దేశానికి కూడా అవసరమన్న అభిప్రాయం ఆయన ప్రశ్నలో కనిపిస్తోంది. ఇంజనీరింగ్ ఇన్ సైడర్ పేరుతో ఉన్న ట్విట్టర్ యూజర్ దీన్ని షేర్ చేయగా, ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. ఇప్పటికే దీన్ని 18 లక్షల మంది చూశారు. నెదర్లాండ్స్ లోని హార్డర్ విక్ పట్టణ సమీపంలో ఈ బ్రిడ్జిని 2002లో ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa