ప్రస్తుతం ఓ ఐదు నిమిషాలు స్మార్ట్ ఫోన్ చేతిలో లేకుండా ఉండలేని పరిస్థితి. దీని ద్వారా దైనందిన జీవితంలో ఎన్నో ముఖ్యమైన పనులను పూర్తిచేసుకుంటున్నారు. అటువంటి స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణలో కీలకమైన లిథియం అయాన్ బ్యాటరీకి ఆద్యుడు, నోబెల్ అవార్డు గ్రహీత జాన్ బీ గుడినెఫ్ కన్నుమూశారు. శత వసంతాలు పూర్తిచేసుకున్న ఆయన టెక్సాస్లోని ఆస్టిన్లో ఆదివారం తుదిశ్వాస విడిచినట్టు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఆయన మరణానికి కారణం మాత్రం వెల్లడించలేదు. ‘ఈ అమెరికన్ తన కెరీర్లో అనేక దశాబ్దాలుగా శాస్త్రీయ పరిశోధనలో అత్యాధునికమైన నాయకుడిగా ఉన్నారు’ అని టెక్సాస్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ జే హార్టజెల్ అన్నారు.
స్మార్ట్ ఫోన్లనే కాదు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు, ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ లిథియం అయాన్ బ్యాటరీయే ఆధారం. 1980 వదశకంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫ్రొసెసర్గా పనిచేస్తున్న సమయంలో గుడినెఫ్.. లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ క్యాథోడ్ బ్యాటరీని అభివృద్ధి చేశారు. బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త డాక్టర్ విట్టింగ్ హమ్ అభివృద్ధి చేసిన మోడల్కు గుడ్నెఫ్ మరింత మెరుగులద్దారు. అధిక ఇంధన నిల్వ సామర్థ్యం, భద్రతను పెంచే దిశగా చర్యలు చేపట్టారు. అయితే, లిథియం అయాన్ బ్యాటరీ ఆవిష్కరణలో ముఖ్య భూమిక పోషించినప్పటికీ రాయల్టీని మాత్రం ఆయన పొందలేకపోయారు. బ్రిటిష్ ఆటోమిక్ ఎనర్జీ రిసెర్చ్ అసోసియేషన్తో బ్యాటరీ పరిశోధనపై హక్కులకు సంబంధించి సంతకం చేశారు.
లిథియం అయాన్ బ్యాటరీ సామర్థాలను గుర్తించిన స్విట్జర్లాండ్, జపాన్ పరిశోధకులు వాటి పనితీరు పెంచడంపై దృష్టి సారించారు. లిథియంను గ్రాఫిటిక్ కార్బన్ లేయర్తో రూపొందించడం వల్ల బ్యాటరీ పనితీరు మెరుగుపడుతుందని, సామర్థ్యం, భద్రత పెరుగుతుందని వారు గుర్తించారు. చివరికి 1991లో సోనీ సంస్థ గుడినెఫ్ రూపొందించిన క్యాథోడ్, కార్బన్ యానోడ్తో కలిపి ప్రపంచంలో తొలి భద్రమైన లిథియం అయాన్ రీఛార్జబుల్ బ్యాటరీని తయారుచేసింది. గుడ్నెఫ్ పరిశోధనలకు 2019లో నోబెల్ పురస్కారం లభించింది. బ్యాటరీ టెక్నాలజీ అభివృద్ధిలో బ్రిటిష్ అమెరికన్ స్టాన్లీ విట్టింగ్హమ్, జపాన్కు చెందిన అకిరా యోషినోతో సంయుక్తంగా డాక్టర్ గుడినెఫ్ 97 ఏళ్ల వయసులో నొబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. అత్యధిక వయసులో నోబెల్ దక్కిన తొలి వ్యక్తిగా నిలిచారు.
‘ఇది శిలాజ ఇంధన రహిత ప్రపంచాన్ని కూడా సాధ్యం చేస్తుంది.. ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ కార్లను శక్తివంతం చేయడం నుంచి పునరుత్పాదక వనరుల శక్తిని నిల్వ చేయడం వరకు ప్రతిదానికీ ఉపయోగపడుతుంది’ అని గుడ్నెఫ్ లిథియం బ్యాటరీ గురించి చెప్పిన మాటలివి. ఇటీవలి సంవత్సరాలలో గుడ్నెఫ్ బృందం బ్యాటరీ సామర్థ్యం పెంపు కోసం అన్వేషిస్తున్నారు. ఇందులో ఘన-స్థితి ఎలక్ట్రోలైట్, లిథియం లేదా సోడియం మెటల్ ఎలక్ట్రోడ్లతో కూడిన గ్లాస్ బ్యాటరీ కూడా ఉన్నాయి. నోబెల్ పురస్కారం అందుకున్న సమయంలో ‘97 సంవత్సరాల వరకు జీవించండి.. మీరు ఏదైనా సాధించగలరు’ అని చెప్పారు. అంతేకాదు, 65 ఏళ్ల వయస్సులో బలవంతంగా తనతో పదవీ విరమణ చేయించనందుకు కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa