కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివాణంకు చెందిన నిర్మల పట్టుబట్టి అనుకున్నది సాధించింది. ఆమె చదువుకు సంబంధించి అన్నివిధాలా సహకారం అందిస్తామని కర్నూలు కలెక్టర్ డాక్టర్ సృజన తెలిపారు. విద్యార్థిని, ఆమె తల్లి హనుమంతమ్మను కలెక్టర్ తన క్యాంపు కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. నిర్మల చదువుకునేందుకు అన్నివిధాలా సహకరిస్తామని చెప్పి.. తల్లి హనుమంతమ్మను ఆస్పరి కేజీబీవీలో బైపీసీ గ్రూప్లో చేర్పించి అన్ని వసతులు అందేలా చూడాలని సమగ్ర శిక్ష ప్రాజెక్టు అదనపు సమన్వయకర్తను, ఆదోని ఎంఈవో ఆదేశించారు.
ఆదోని మండలం పెద్ద హరివణంకు చెందిన శ్రీనివాసులు, హనుమంతమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరిలో నిర్మల చిన్న కుమార్తె కాగా.. మిగిలిన ముగ్గురికి వివాహాలు చేశారు. నిర్మల చదువుల్లో రాణిస్తోంది.. పదో తరగతిలో ఏకంగా 537 మార్కులు తెచ్చుకుంది. బాగా చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని భావించింది. కానీ తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత ఆ బాలిక ఉన్నత చదువులకు అడ్డంకిగా మారింది. ఆమె చదువుకుంటానని చెప్పినా పెద్దలు మాత్రం ఒప్పుకోలేదు.. ఇంటి దగ్గర ఉంటూ సాయంత్రం చిన్న పిల్లలకు ట్యూషన్లు చెబుతూ పొలం పనులకు వెళ్లేది.
నిర్మలకు బాగా చదువుకోవాలని ఆశ కలిగింది. ఈ క్రమంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా.. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి, అధికారులు ఇంటింటికీ తిరుగుతూ ఆ బాలిక ఇంటి వైపు వెళ్లారు. అప్పుడు నిర్మల తన మనసులో మాటను ఎమ్మెల్యేతో చెప్పింది. తాను పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నానని.. తాను ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థిక స్థోమత లేదని వివరించింది. తనకు సాయం చేసి.. తన తల్లిదండ్రులను కూడా తనను చదివించేలా ఒప్పించాలని కోరింది.
ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి వెంటనే స్పందించి బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అధికారులకు నిర్మల విషయాన్ని చెప్పి చదువుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వెంటనే కలెక్టర్ డాక్టర్ సృజన స్పందించారు. బాలికను, ఆమె తల్లిదండ్రులను తన క్యాంపు కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు.. చదువుల్లో రాణించే బాలికను ఇలా ఇంటికే పరిమితం చేయడం సరికాదని చెప్పారు. ఆమెను కాలేజీలో చేర్పించేందుకు ఒప్పించారు.. ఆస్పరి కేజీబీవీలో బైపీసీ గ్రూప్లో చేర్పించాలని అధికారుల్ని ఆదేశించారు కలెక్టర్. తాను బాగా చదవుకుని ఐపీఎస్ అవ్వాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్మల చెబుతోంది. తనకు చదువుకోవాలని ఉందని చెప్పిన వెంటనే స్పందించిన కలెక్టర్, అధికారులు, ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa