ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని సంవత్సరాలుగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ షాదీ తోఫా పథకంలో జగన్ సర్కార్ పలు మార్పులు చేసింది. మరో నాలుగు కూలాలను కూడా ఇందులో చేర్చారు. దూదేకులు, నూర్బాషా, పింజరి, లద్దాఫ్ కులస్తులకు కూడా ఇక నుంచి వైఎస్సార్ షాదీ తోఫా పథకం ద్వారా రూ.లక్ష ఆర్ధిక సాయం అందించనున్నారు. ఇస్లాం మతాన్ని ఆచరించే ఆ కులాలు బీసీ-బీ కింద ఉండటంతో.. వారికి రూ.50 వేలు మాత్రమే ఇప్పటివరకు ఇస్తున్నారు.
కానీ తమకు కూడా రూ.లక్ష సాయం ఇవ్వాలని ఇటీవల దూదేకుల కులానికి చెందిన కొంతమంది ప్రతినిధులు సీఎం జగన్ను కలిసి కోరారు. ఈ నేపథ్యంలో సానుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. షాదీ తోఫా పథకంకు సంబంధించిన విషయంలోనే కాకుండా అన్ని ప్రభుత్వ పథకాల్లోనూ వారిని ముస్లింలుగా గుర్తించి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆ కులాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
షాదీ తోఫా పథకం ద్వారా పెళ్లి చేసుకున్న మైనార్టీ జంటలకు రూ.లక్ష చొప్పున ఆర్ధిక సహాయం అందచేస్తున్నారు. వీటికి నేరుగా లబ్ధిదారుల అకౌంట్లల్లో జమ చేస్తున్నారు. 2020 అక్టోబర్ 1 నుంచి ఈ పథకం ప్రారంభించగా.. ఇప్పటివరకు ఎన్నో కొత్త జంటలకు సాయం అందించారు. అలాగే ఇతర వెనుకబడిన కులాల్లోని కొత్త జంటలకు వైఎస్సార్ కల్యాణ మస్తు అనే పథకం ద్వారా ప్రభుత్వం సాయం చేస్తోంది. కల్యాణ మస్తు పథకం ద్వారా షెడ్యూల్ కులాల వారికి రూ.లక్ష, బీసీ కులాలకు రూ.50 వేలు, దివ్యాంగులకు రూ.లక్ష 50 వేలు సాయం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa