ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయ కారణాలతో ఉపాధ్యాయుడు కృష్ణను చంపడం ఘోరం: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 16, 2023, 04:46 PM

విజయనగరం జిల్లా రాజాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ (58) దారుణ హత్యను తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. రాజకీయ కారణాలతో ఒక టీచర్‌ను చంపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి సంఘటనలకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, అధికారుల ఉదాసీన వైఖరే కారణమని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.


రాజాంలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ శనివారం ఉదయం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఉపాధ్యాయుడు కృష్ణను ప్రత్యర్థి వర్గం బొలెరో వాహనంతో ఢీకొట్టి హతమార్చి.. తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అక్కడి పరిస్థితులను చూసి ఇది హత్యేనని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సంఘటనా స్థలం వద్దనే బైఠాయించి ఆందోళనకు దిగారు.


దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా, హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని నిర్ధారణ అయింది. మృతుడి కుమారుడు శ్రావణ్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు తెర్లాం మండలం ఉద్దవోలుకు చెందిన మరడాన వెంకటనాయుడు, మోహనరావు, గణపతి, రామస్వామిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ రవికుమార్‌ వెల్లడించారు.


ఉపాధ్యాయుడు కృష్ణ (58) అంత్యక్రియలు ఆదివారం ఉదయం ఉద్దవోలులో ముగిశాయి. మరోవైపు కృష్ణ స్వగ్రామమైన ఉద్దవోలులో పోలీసు పికెటింగ్‌ కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa