ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యక్తి తలనరికి వేలాడదీసిన దుండగులు,,,మణిపూర్‌లో జరిగిన మరో ఘటన వైరల్

national |  Suryaa Desk  | Published : Fri, Jul 21, 2023, 09:37 PM

రెండున్నర నెలలుగా హింసాత్మక ఘటనలు, ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న మణిపూర్‌కు సంబంధించి ఒక్కొక్క దారుణమైన ఘటనలు బయటికి వస్తున్నాయి. ఇటీవల ఇద్దరు మహిళలను బట్టలు లేకుండా నగ్నంగా ఊరేగించి.. సామూహిక అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్రంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తలను అత్యంత దారుణంగా నరికేసి.. కంచెకు వేలాడదీసిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో మణిపూర్‌లో ఇలాంటి ఘటనలు ఇంకెన్ని జరిగాయోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్న మణిపూర్‌లో మరో షాకింగ్ ఘటన బయటికి వచ్చింది. వ్యక్తిని తలను వేలాడదీసిన ఘటన బిష్ణుపూర్‌ జిల్లాలో జరిగినట్లు తెలుస్తోంది. జులై 4 వ తేదీ అర్ధరాత్రి కుకీ, మెయితీ వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇందులో కుకీ తెగకు చెందిన నలుగురు వ్యక్తులను మెయితీ వర్గానికి చెందిన వారు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇందులో డేవిడ్ థీక్‌ అనే వ్యక్తి తలను నరికి.. మొండెం నుంచి వేరు చేశారు. అంతటితో ఆగకుండా అనంతరం అక్కడ వెదురు కర్రలతో చేసిన కంచెకు డేవిడ్ థీక్ తలను వేలాడదీశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారడంతో అసలు విషయం బయటికి వచ్చింది.


అయితే ఘర్షణలు చెలరేగడంతో మణిపూర్‌లో మే 3 వ తేదీ నుంచి ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. దీంతో అప్పటి నుంచి జరిగిన ఘటనలను స్థానికులు రికార్డ్ చేశారు. అయితే ఇటీవల ఇంటర్నెట్ సర్వీసులు పునరుద్ధరించడంతో మే 3 వ తేదీ నుంచి జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో ఉంచడంతో అవి వైరల్‌గా మారుతున్నాయి. దీంతో మణిపూర్‌లో జరిగిన ఆకృత్యాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. అనంతరం అందులో ఒక మహిళపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన బుధవారం బయటికి రావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. మళ్లీ తాజాగా మరో సంఘటన వెలుగులోకి రావడంతో పరిస్థితులు తీవ్రంగా మారాయి.


మణిపూర్‌లో మెజారిటీలుగా ఉన్న మెయితీలకు ఎస్టీల్లో కలపాలన్న ప్రతిపాదనతో మెయితీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. దీనికి వ్యతిరేకంగా కుకీలు మే 3 వ తేదీన భారీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే ఈ నిరసన ర్యాలీపైకి మెయితీ వర్గానికి చెందిన కొంతమంది అల్లరి మూక రాళ్ల దాడులు చేయడంతో మణిపూర్‌లో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. అప్పటి నుంచి మణిపూర్ మొత్తం అట్టుడికిపోతోంది. మణిపూర్ లో చెలరేగిన ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు దాదాపు 200 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. వేలాది ఇళ్లు ధ్వంసం కావడంతో ఎంతోమంది నిరాశ్రయులై ప్రభుత్వ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa