ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గర్జిస్తే తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లాగులో పోసుకుంటారని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి లోకేష్.. సీఎం జగన్కు భయాన్ని పరిచయం చేస్తారా అని ఎద్దేవా చేశారు. విజయవాడలో తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి రచించిన ‘అల్లుడు సుద్దులు’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీకి పట్టిన శని లోకేష్ అని వ్యాఖ్యానించారు.
ఆ లోకేష్ పేరు మీద టీడీపీ గంగలో కలిసిపోతుందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఒక పుస్తకం రాశారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికార దాహంతో ఆతృతపడతారని విమర్శించారు. చంద్రబాబు గతంలో లక్ష్మీపార్వతి భుజం మీద నుంచి తుపాకీ పెట్టి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)ను కాల్చేశారని తీవ్ర కామెంట్స్ చేశారు. చంద్రబాబు పూర్తి నిజస్వరూపం లక్ష్మీపార్వతికి ఇంకా తెలియదేమో అనుకుంటా.. కానీ, ఆయన బావమరిదికి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు మాత్రం పూర్తి తెలుసన్నారు. బంధుత్వాలను, డబ్బును వాడుకుని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.
అలాగే, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల ఖర్చులు పెరిగాయని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఎన్టీఆర్ ఒక భోళాశంకరుడు.. ఎవరినైనా నిలబెట్టి గెలిపించగలనన్న విశ్వాసం పొందగలిగిన వ్యక్తి అని కొనియాడారు. అలాంటి లక్షణమే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డికి వచ్చిందని.. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చిందని తెలిపారు. కానీ, చంద్రబాబు మాత్రం అధికారం కోసం ఎవరితో అయినా కలుస్తారని విమర్శించారు. చంద్రబాబు దత్తపుత్రుడు కూడా అందరితో కలిశారంటూ పవన్ కళ్యాణ్పై సెటైర్లు వేశారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నానా గడ్డి కరుస్తున్నాడని దుయ్యబట్టారు. సీఎం జగన్వి సాంప్రదాయేతర రాజకీయాలని.. కానీ, ఎవరి భుజాల మీదైనా ఎక్కేందుకు చంద్రబాబు చూస్తున్నాడని వ్యాఖ్యానించారు.
ఇక, నారా లోకేష్ తో చేరి పవన్ కళ్యాణ్ పాడైపోతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. రోజుకు రూ. 2 కోట్లు సంపాదించే పవన్ కళ్యాణ్.. ట్యాక్స్ కడుతున్నాడో లేదో? అనే అనుమానాలు ఉన్నాయన్నారు. తమ కులం వాళ్లు ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటారని.. కానీ, పవన్ కళ్యాణ్ నాశనం అవ్వడమే కాకుండా సినిమా పిచ్చితో ఉన్న యువకులు పాడైపోతున్నారని దుయ్యబట్టారు. త్వరలో పవన్ కళ్యాణ్పై కూడా పుస్తకం రాయాల్సి వస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్కి కూడా పంపించాలని లక్ష్మీపార్వతిని కోరారు. ఈ పుస్తకం చదివి అయినా పవన్ కళ్యాణ్ జ్ఞానోదయం పొందాలని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa