ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కావలి- బిట్రగుంట రైలు మార్గంలో తప్పిన పెను ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 30, 2023, 06:02 PM

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి- బిట్రగుంట రైల్వేస్టేషన్ల మధ్య పెను ప్రమాదం తప్పింది. ఆదివారం తెల్లవారుజామున నర్సాపురం నుంచి ధర్మవరం వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ ప్రమాదం నుంచి బయటపడింది. కావలి- బిట్రగుంట మధ్య ఎగువ మార్గంలో ముసునూరు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెండు మీటర్లు ఉన్న రైలు పట్టా ముక్కను ట్రాక్‌పై అడ్డంగా పెట్టారు.


ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం నర్సాపురం- ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ అదే మార్గంలో వచ్చింది. అయితే అదృష్టవశాత్తూ పట్టా ముక్కను రైలు ఢీకొట్టగానే అది దూరంగా పడిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనపై రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.


అయితే, ఇది ఆకతాయిల పనా లేక దీని వెనక ఏమైనా కుట్ర ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇటీవల ఒడిశా రాష్ట్రంలో రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో వందలాది మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అలాగే, దాదాపు వెయ్యి మంది గాయాలపాలయ్యారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతంలో రైల్వే పట్టాలకు అడ్డంగా పెద్ద పట్టా ముక్కను పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ దీని వల్ల ప్రమాదం జరిగి ఉంటే ఆ తీవ్రతను ఊహించడం కూడా కష్టంగా ఉంటుంది. ఈ క్రమంలో ఈ పని ఎవరు చేశారనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని పలువురు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa