ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నకిలీ పత్రాలతో బస్సులు వేలంలో అమ్మకం,,,ఆర్టీసీ మాజీ ఉద్యోగికి 383 ఏళ్ల జైలుశిక్ష

national |  Suryaa Desk  | Published : Sun, Jul 30, 2023, 09:54 PM

నకిలీ పత్రాలను సృష్టించి, మోసానికి పాల్పడి ప్రభుత్వానికి నష్టాన్ని కలిగించిన ఉద్యోగులపై నమోదైన కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఆర్టీసీ మాజీ ఉద్యోగికి 383 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.3.32 కోట్ల జరిమానా విధించింది. 35 ఏళ్ల నాటి కేసులో ఈ మేరకు తమిళనాడులోని కోయంబత్తూర్ కోర్టు తీర్పు చెప్పింది. కేసు వివరాల్లోకి వెళ్తే... చేరన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ ప్రస్తుత తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కోయంబత్తూర్ డివిజన్‌ పరిధిలోని బస్సుల వేలం ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నట్టు 1988 నవంబర్ 9న పోలీసులకు ఫిర్యాదు అందింది.


నకిలీ పత్రాలతో 47 బస్సులను విక్రయించి రూ. 28 లక్షలు కొట్టేశారంటూ 8 మంది ఉద్యోగులపై ఉన్నతాధికారులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదయ్యింది. ఈ క్రమంలో కోదండపాణి, రామచంద్రన్, నాగరాజన్, నటరాజన్, మురుగనాథన్, దురైసామి, రంగనాథన్, రాజేంద్రన్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కోర్టులో కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో నటరాజన్, రామచంద్రన్, రంగనాథన్, రాజేంద్రన్ మృతి చెందారు.


మరోవైపు, బతికున్న నలుగురిలో కోదండపాణి మినహా మిగతా ముగ్గురునీ న్యాయస్థానం నిర్దోషులుగా పేర్కొంది. ఆర్టీసీని మోసం చేసినందుకు కోదండపాణికి 47 నేరాలకు నాలుగేళ్ల చొప్పున 188 ఏళ్లు, 47 ఫోర్జరీ కేసులకు నాలుగేళ్ల చొప్పున 188 ఏళ్లు, ప్రభుత్వ ఆస్తులను కాజేసినందుకు మరో ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ మూడింటిని కలిపితే మొత్తం 383 సంవత్సరాల శిక్ష అవుతుంది. ప్రస్తుతం కోదండపాణి వయసు 82 ఏళ్లు కావడంతో కోర్టు మినహాయింపు ఇచ్చింది. ఏడేళ్ల జైలు శిక్షను ఏకకాలంలో అనుభవించాలని న్యాయమూర్తి పీకే శివకుమార్ ఆదేశించారు. చేరన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌‌లో అసిస్టెంట్‌గా పనిచేసిన కోదండపాణి.. సంస్థకు చెందిన పూర్తి మొత్తం సొమ్ము చెల్లించకుండానే 14 బస్సులను వేలంలో దక్కించుకున్న వ్యక్తులకు అప్పగించినట్టు నేరం నిరూపితమయ్యింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa