వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల సెలబ్రేషన్స్ సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు, వైఎస్సార్సీపీ నేతలు పవన్ కళ్యాణ్ ‘బ్రో’ సినిమాను టార్గెట్ చేసిన నేపథ్యంలో.. చిరంజీవి వారికి కౌంటర్ ఇచ్చినట్లుగా మాట్లాడారు. ‘‘మీలాంటి వాళ్లు పెద్ద పెద్ద విషయాల్లో ఇన్వాల్వ్ కావాలి. ప్రత్యేక హోదా గురించి.. ప్రాజెక్టుల గురించి.. రోడ్ల నిర్మాణం గురించి ఆలోచించాలి.. పేదవారి కడుపు నింపే దిశగా ప్రయత్నించాలి.. ఉద్యోగ-ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే ప్రతి ఒక్కరూ మీకు తల వంచి నమస్కరిస్తారు. అంతే కానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి’’ అని చిరంజీవి వ్యాఖ్యానించారు.
మెగాస్టార్ నేరుగా ఎవరి పేరు ప్రస్తావించకపోయినప్పటికీ.. అవి ఏపీలోని జగన్ సర్కారును ఉద్దేశించి చేసినవేనని స్పష్టం అవుతోంది. వాస్తవానికి చిరంజీవి ఇప్పటి దాకా జగన్ సర్కారుతో సఖ్యతగా ఉండేందుకే ప్రయత్నించారు. కానీ ఒక్కసారిగా ఆయన స్వరం మారడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సినీ ఇండస్ట్రీ తరఫున ప్రభాస్, మహేశ్ బాబు లాంటి స్టార్లతో వెళ్లి జగన్ను కలిసిన చిరంజీవి.. టికెట్ రేట్ల విషయంలో సీఎంను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించారు. మరో సందర్భంలో సతీసమేతంగా తాడేపల్లి వెళ్లగా.. జగన్ దంపతులు వారికి సాదర స్వాగతం పలికారు.
ఓవైపు పవన్ కళ్యాణ్ జగన్ సర్కారుపై పోరాటం చేస్తుంటే.. చిరంజీవి ఇలా సీఎంతో సంబంధాలు నెరపడం జనసైనికులకు మింగుపడలేదు. మరోవైపు జగన్ కూడా పవన్ పట్ల ఆగ్రహంతో ఉన్నప్పటికీ.. చిరంజీవి విషయంలో దాన్ని కనిపించనీయలేదు. పైగా మెగాస్టార్కు ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. చిరంజీవి ఆప్యాయంగా అన్నా అని పిలుస్తూ.. మెగా అభిమానులను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. ఓ దశలో చిరంజీవికి జగన్ రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేస్తారనే ప్రచారమూ జరిగింది.
అప్పట్లో వైఎస్సార్సీపీ శ్రేణులు చిరంజీవిని పొగుడుతూ.. పవన్ కళ్యాణ్పై సెటైర్లు వేసేవి. కానీ తమ జోలికి రానంత వరకే మెగాస్టార్.. వస్తే ఎవరైనా ఒకటే అని నేరుగా చెబుతున్నాయి. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు నేరుగా జగన్ సర్కారును తాకిన నేపథ్యంలో.. మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు ఆయనకు కౌంటర్లు ఇస్తున్నారు. కొడాలి నాని అయితే ఏకంగా పకోడీ గాళ్లంటూ తనదైన భాషలో పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
చిరంజీవి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారని.. జనసేనకు అండగా నిలుస్తారనే ప్రచారమూ జరుగుతోంది. తాను రాజకీయాల్లోకి రాబోనని చిరంజీవి ఇప్పటికే పదే పదే చెప్పారు. బీజేపీ ఆయన్ను రాజకీయాల్లోకి రప్పించడం కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కానీ తన తమ్ముడు రాజకీయంగా మంచి స్థానానికి చేరుకుంటాడని మెగాస్టార్ ఆకాంక్షించారు. తన మద్దతు పవన్కు ఉంటుందన్నారు.
దీంతో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. జనసేనకు మెగాఫ్యాన్స్ అందరి మద్దతు లభించేలా చూడటమే కోసం చిరంజీవి ఇలా మాట్లాడారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చిరంజీవి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేకపోవచ్చు గానీ.. పవన్ కళ్యాణ్కు మద్దతుగా నేరుగా మాట్లాడే ఛాన్స్ ఉంది.
మరోవైపు చిరంజీవి వ్యాఖ్యలతో ఏపీతోపాటు సోషల్ మీడియాలోనూ పొలిటికల్ హీట్ పెరిగింది. మెగా ఫ్యాన్స్ వర్సెస్ వైసీపీ అభిమానులు అన్నట్టుగా పోరు నడుస్తోంది. చిరంజీవిపై వైసీపీ అభిమానులు ట్రోలింగ్కు దిగుతుండగా.. మెగా ఫ్యాన్స్ వారికి కౌంటర్ ఇస్తున్నారు. చిరంజీవి గొప్పతనాన్ని చాటేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రానున్న రోజుల్లో చిరంజీవి గనుక జనసేనకు మద్దతుగా మాట్లాడితే.. ఈ సోషల్ వార్ ఓ రేంజ్లో ఉండటం ఖాయం. ఒకవేళ మెగాస్టార్ గనుక మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే గనుక.. ఏపీలో పొలిటికల్ హీట్ తారా స్థాయికి చేరుతుందేమో..!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa