ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ విషయాన్ని గమనిస్తే మంచిది.. చిరంజీవి వ్యాఖ్యలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2023, 09:12 PM

మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి.. మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతల నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఈ ఎపిసోడ్‌పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. విమర్శలకు, వివాదాలకు దూరంగా ఉండే అందరివాడు మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇబ్బంది కలిగి అలా మాట్లాడారంటే అర్థం చేసుకోవాలి అన్నారు. రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో.. చిరంజీవి చెప్పిన దానిలో తప్పేముంది నిజాలే మాట్లాడారంటూ గంటా వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చారు అంతే కదా అన్నారు.


'మీరు ప్రత్యేక హోదా గురించి.. రోడ్ల నిర్మాణం గురించి.. ప్రాజెక్టుల గురించి.. పేదవాడి కడుపు నింపే ఉద్యోగ ఉపాధి కల్పన గురించి ఆలోచించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని' హితవు పలికారు. అలా కాదని పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాగా ఇండస్ట్రీ మీద పడతారేంటి అని ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రభుత్వాలను గుండెల్లో పెట్టుకుంటారన్నారు.. ఆయన చెప్పిన వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి వైపు దృష్టి పెట్టాలన్నారు.


అలాంటిది పక్కన పెట్టి పట్టుమని పది నిముషాలు తమ శాఖలు గురించి మాట్లాడలేని మంత్రులందరూ మీడియా ముందుకు వచ్చి అదేదో బ్రహ్మాండం బద్దలైనట్టు ఏదేదో ఆయన గురించి మాట్లాడటం సరికాదన్నారు. ఏపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమపై కాకుండా ఉద్యోగాలు, పేదలపై దృష్టి సారించాలన్న మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలను తెలుగు ప్రజలందరూ సమర్థిస్తున్నారంటూ ట్వీట్ చేశారు.


వాల్తేరు వీరయ్య 200 రోజుల సక్సెస్ ఈవెంట్‌లో మెగాస్టార్ ఏపీ ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. 'మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం గురించి ఆలోచించాలని.. సంక్షేమ పథకాలు, ఉద్యోగ-ఉపాధి అంశాలపై దృష్టిసారించాలి' అన్నారు. పేదరికం కడుపు నింపే దిశగా ఆలోచించాలని.. అలా చేసినప్పుడే ప్రజలు మెచ్చుకుంటారన్నారు. అంతేగానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు విరుచుకుపడ్డారు.


ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. తమ ప్రభుత్వానికి ఇచ్చే ఉచిత సలహాలు.. తమ గురించి మాట్లాడుతున్న పరిశ్రమలోని వ్యక్తులకు ఇస్తే బాగుంటుందన్నారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పకోడిగాళ్ళు తమకు సలహాలిస్తున్నారని.. అదేదో ఆ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొందరికి కూడా సలహాలు చెప్పొచ్చు కదా అన్నారు. తమ్ముడు తనవాడైనా ధర్మం మాట్లాడమని చిరంజీవి గారిని కోరుతున్నాను అన్నారు మంత్రి అంబటి రాంబాబు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు తాను పూర్తిగా వినలేదని.. తాను త్వరలోనే స్పందిస్తానన్నారు. చిరంజీవి అంటే తనకు గౌరవం ఉందని.. ఆయనపై గౌరవానికి కారణాలను చెబుతానన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa