విశాఖపట్నం: తెలిసీ తెలియని వయసులో ఓ అమ్మాయి చేసిన తప్పిదం ఆమె తల్లిదండ్రులకు తీవ్ర గుండె కోతను మిగిల్చింది. ఆమె నడిపిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ కారణంగా మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఒకరిని ప్రేమించి.. మరొకరిని రహస్య వివాహం చేసుకున్న ఆ అమ్మాయి.. తాను ఆత్మహత్య చేసుకోవడంతోపాటు.. మరొకరి మృతికి కారణమైంది. పెళ్లాడిన యువకుడు సైతం ఇప్పుడు జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. కొత్తపాలెం నాగేంద్ర కాలనీనికి చెందిన 16 ఏళ్ల అమ్మాయి.. విశాఖలోని ఓ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివేది.
ఆదర్శ నగర్కు చెందిన సూర్య ప్రకాశ్ రావుతో ప్రేమలో ఉన్న ఆ అమ్మాయి.. ఇందిరా నగర్కు చెందిన లెంకా సాయి కుమార్ను రహస్యంగా పెళ్లాడింది. కానీ సూర్య ప్రకాశ్తో ఆమె చనువుగానే మెలిగేది. ఇది సాయికి నచ్చ లేదు. అదే సమయంలో సాయి కుమార్తో ఆమె చనువుగా ఉండటం సూర్య ప్రకాశ్కు నచ్చలేదు. దీంతో వారిద్దరితోనూ ఆ అమ్మాయికి మనస్పర్థలు వచ్చాయి.
ఇటీవల సూర్య ప్రకాశ్, సాయి కుమార్ ఇద్దరూ ఆ అమ్మాయి ఇంటికి వేర్వేరు సమయాల్లో వచ్చారు. మా ఇద్దరిలో ఎవరితో ఉంటావో తేల్చుకోవాలని సూచించారు. వారు ఇలా చెప్పిన రెండు రోజులకే ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సూర్య ప్రకాశ్, సాయి కుమార్లపై ఆ అమ్మాయి తండ్రి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. వారిద్దరూ ఒత్తిడి చేయడం వల్లే అమ్మాయి బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
ఈ విషయం తెలియడంతో.. తాను పోలీసుల విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళనతో ఆమె ప్రియుడు సూర్య ప్రకాశ్.. శుక్రవారం గోపాలపట్నం వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అది తమ కుమారుడి మృతదేహమేనని సూర్యప్రకాశ్ తల్లిదండ్రులు శనివారం గుర్తించారు. ఇంటర్ స్టూడెంట్ను రహస్యంగా పెళ్లాడిన సాయికుమార్ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. బేబీ సినిమాను తలపించిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్థానికంగా చర్చనీయాంశమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa