తిరుమల కాలినడక మార్గంలో చిన్నారి లక్షితపై చిరుత దాడిచేసి చంపేసిన నేపథ్యంలో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రాకపోకలపై కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. సోమవారం తిరుపతిలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి భద్రతాపరమైన ఏర్పాట్లపై చర్చించారు. ఆ వివరాలను కరుణాకర రెడ్డి మీడియాకు వివరించారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీవారి మెట్టు వద్ద రోజుకు 15 వేల దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని, ఇకపై నడకదారిలో వీటిని స్కానింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. దివ్యదర్శన టోకెన్లు పొందిన భక్తులు రోడ్డు మార్గంలో కూడా తిరుమలకు వెళ్లవచ్చన్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 12 ఏళ్లలోపు చిన్నపిల్లలను వారి తల్లిదండ్రులతో అనుమతిస్తామని చెప్పారు. పెద్దలకు రాత్రి 10 గంటల వరకూ అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. నడకదారి భక్తులకు సహాయకారిగా ఉండేలా ప్రతి ఒక్కరికీ ఊతకర్ర ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఘాట్ రోడ్లలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ద్విచక్రవాహనాలను అనుమతిస్తామని చెప్పారు. భక్తుల రక్షణ కోసం అటవీశాఖ ఆధ్వర్యంలో నిపుణులైన సిబ్బందిని నియమించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాధు జంతువులకు ఆహార పదార్థాలు అందించే వారిపైనా, ఆహార పదార్థాలు విక్రయించేవారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. నడకదారుల్లో 500 కెమెరా ట్రాప్లు ఏర్పాటు చేశామని, అవసరమైతే డ్రోన్లను కూడా వినియోగిస్తామని చెప్పారు. వైల్డ్లైఫ్ అవుట్ పోస్టులు ఏర్పాటుచేసి, నిరంతరం యానిమల్ ట్రాకర్లను, వైద్యులను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. రోడ్డుకి ఇరువైపులా 30 అడుగుల దూరం కనిపించేలా ఫోకస్ లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఫెన్సింగ్ ఏర్పాటు అంశంపై అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెస్పారు. క్రూర మృగాలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa