ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టిసీమ ప్రాజెక్టుపై బురద జల్లే ప్రచారం,,,,స్పందించిన ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 15, 2023, 08:08 PM

ఏపీలో పట్టిసీమ ప్రాజెక్ట్ మరోసారి చర్చనీయాంశమైంది. పట్టిసీమ పంపులను ఇరిగేషన్ అధికారులు ప్రారంభించడంతో.. టీడీపీ నేతలు జగన్ సర్కార్‌ను టార్గెట్ చేశారు. నాలుగేళ్లగా పంపుల్ని ఉపయోగించలేదని.. వైఎస్సార్‌సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టిసీమ దండగ అన్నారని.. ఇప్పుడే ఆ ప్రాజెక్టే నీళ్లు ఇస్తోందన్నారు. ఈ క్రమంలో పట్టిసీమపై జరిగిన ప్రచారంపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో పట్టిసీమ పథకాన్ని వాడలేదంటూ అసత్యాలతో, ఈ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నించారని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.


గత నాలుగేళ్లుగా జులై మాసం నుంచే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోందన్నారు. ప్రతి ఏటా వందల టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్లిపోయాయని.. ఇలాంటి పరిస్థితుల్లో పట్టిసీమను వినియోగించుకోలేదు అన్నట్టుగా ప్రచారం చేశారన్నారు. మంచి వర్షాలు పడుతూ, నదులన్నీ ప్రవహిస్తూ, సరిపడా సాగు, తాగునీరు అందుబాటులో ఉన్నప్పుడు పట్టిసీమ అవసరం ఏముందన్నారు. గడచిన నాలుగేళ్లుగా ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలిన నీటి వివరాలను వెల్లడించారు. 2019 – 797 టీఎంసీలు.. 2020 – 1278 టీఎంసీలు.. 2021 – 501 టీఎంసీలు.. 2022 – 1331 టీఎంసీలు విడుదల చేసినట్లు తెలిపారు.


అన్ని వందల టీఎంసీల డెల్టా అవసరాలకు మించిన ప్రవాహాలు ప్రకాశం బ్యారేజీ వద్ద నమోదు కావడం వల్లనే గత నాలుగేళ్లుగా పట్టిసీమ పథకాన్ని వాడాల్సిన అవసరం రాలేదన్నారు. అవసరం లేకపోయినా వందల కోట్లు ఖర్చుపెట్టి పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీకి ఎత్తిపోసి తద్వారా సముద్రం పాలు చేయాలని వాదించడం విచిత్రంగా ఉందన్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి పోలవరం పనులు ఎంపీ రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ వారు చేస్తున్నారన్నారు. అయినా సరే పోలవరం పనులు మొదటి రెండేళ్లు నిర్లక్ష్యం చేసి విలువైన సమయాన్ని వృథా చేశారన్నారు. జరిగిన పనిలో కూడా అన్నీ అడ్వాన్స్‌డ్‌ చెల్లింపులే. క్షేత్రస్థాయిలో మట్టి పనులు తప్ప కీలక పనులు ఏమీ చేయలేదన్నారు.


ఈ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, కమీషన్ల కోసం పట్టిసీమను తెరపైకి తెచ్చారన్నారు. ఎక్కడైనా పని సకాలంలో పూర్తిచేస్తే ఒక శాతమో రెండు శాతమో ఇన్సెంటివ్‌ ఇస్తారని.. కానీ, పట్టిసీమలో ఎక్కడా లేని విధంగా 21.99 శాతం ఇన్సెంటివ్‌ అంటే సుమారు రూ.257.55 కోట్లు ఇన్సెంటివ్‌గా ఇచ్చారన్నారు. పట్టిసీమలో భారీ కుంభకోణం జరిగింది అనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని.. పనులు పూర్తిచేయడానికి ఏడాది గడువు పెట్టారన్నారు. కానీ గడువులోగా అన్ని పనులూ పూర్తికాలేదని.. 2016 మార్చి 29వ తేదీకి గడువు పూర్తయ్యిందన్నారు. కానీ హడావుడిగా మార్చి 28న ఫైనల్‌ బిల్లు చేసేశారని.. ఈ వాస్తవాలేవీ వారు ప్రస్తావించలేదన్నారు.


ప్రకాశం బ్యారేజీకి నీళ్లు చేరాలంటే పట్టిసీమ కడితే సరిపోదంది ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్. దాదాపు 178.81 కిలోమీటర్ల దూరం కుడికాలువ పనులు, వాటికి సంబంధించిన కట్టడాలు పూర్తికావాలన్నారు కుడి కాలువ పనులు ఎక్కువశాతం దివంగత నేత వైయస్‌ఆర్‌ హయాంలోనే పూర్తయ్యాయన్నారు. 2004–14 కాలంలో కుడి కాలువ పనులు 131 కిలోమీటర్లు అనగా 73.26 శాతం పూర్తికాగా.. 2014–19 మధ్యలో కేవలం 47.81 కిలోమీటర్లు అనగా 26.74 శాతం పనులే జరిగాయన్నారు.


మొత్తం 12,402 ఎకరాలకుగాను 2004–14 కాలంలో 10,558 ఎకరాలను రూ.391 కోట్లతో (ఒక ఎకరాకు రూ.3.70 లక్షల ఖర్చు) సేకరించారన్నారు. 2014–19 మధ్యకాలంలో కేవలం 1844 ఎకరాల కోసం రూ.834 కోట్లు (ఒక ఎకరాకు రూ.45 లక్షలకుపైగా) ఖర్చు చేశారన్నారు. అంటే వైయస్‌ఆర్‌ గారి హయాంలో 32 శాతం నిధులతో 86 శాతం భూసేకరణ పూర్తిచేస్తే.. చంద్రబాబు హయాంలో 68 శాతం నిధులు ఖర్చు చేసి 14 శాతం భూసేకరణ మాత్రమే చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు 2018లో పూర్తిచేస్తామని శపథాలు చేసి.. 2017లో పురుషోత్తపట్నం మీద రూ.1,930 కోట్లు ఖర్చు పెట్టి పోలవరం ఎడమ కాలువకు నీరు ఇవ్వాలనుకున్నారు అన్నారు. ఇది అవగాహనా రాహిత్యంతో చేసిన పని అని.. ఈ పనులు కేవలం తమవాళ్ల జేబులు నింపడానికే చేశారని ఇట్టే అర్థమవుతుందన్నారు.


మఎలాంటి అనుమతులు పొందకుండానే పట్టిసీమను, పురుషోత్తపట్నం ప్రాజెక్టునూ నిర్మించారని.. పర్యావరణ అనుమతి లేనందున దీనిమీద నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో రూ.24.90 కోట్ల పరిహారం విధించారన్నారు. ఈ భారం అంతా ప్రభుత్వం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని.. పైగా పురుషోత్తపట్నం ప్రాజెక్టును ప్రారంభించడానికి వీల్లేదు అని ట్రిబ్యునల్‌ వారు నిబంధన పెట్టారన్నారు. అందువల్ల ఈ పథకం అటు రైతులకు ఉపయోగపడక, పెట్టిన రూ.1900 కోట్లు బూడిదలో పోసిన పన్నీరులా మారిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa