ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిమాచల్‌లో వరద బీభత్సం.. 52 మంది మృతి

national |  Suryaa Desk  | Published : Tue, Aug 15, 2023, 08:33 PM

హిమాలయ రాష్ట్రాల్లో ఆకాశానికి చిల్లులు పడ్డాయా? అన్నట్టు వర్షాలు కురుస్తున్నాయి. శివాలిక్‌ రాష్ట్రాలైన హిమాచల్‌, ఉత్తరాఖండ్‌లలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఒక్క హిమాచల్‌లో వేర్వేరు చోట్ల కొండచరియలు విరిగిపడి వరదలు కారణంగా 50 మందికిపైగా మృతిచెందారు. పౌరులంతా ఇళ్లలోనే ఉండాలని, కాలువలు, నదుల వద్దకు వెళ్లొద్దని సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు హెచ్చరించారు. ఇదే సమయంలో ఉత్తరాఖండ్‌లోనూ వర్షాలు ముంచెత్తడంతో ఛార్ ధామ్ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి.


గత రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌‌లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. వర్షాలకు ముఖ్యంగా హిమచల్ ప్రదేశ్‌‌ చిగురుటాకులా వణికిపోతోంది. ఆ రాష్ట్రంలో గత 24 గంటల్లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. 700కిపైగా రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం సిమ్లాలోని సమ్మర్‌హిల్‌ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి అక్కడ ఉన్న శివాలయం కుప్పకూలింది. ఈ శిథిలాల నుంచి 11 మృత దేహాలను వెలికితీశారు. ఇంకా, మరో 20 మంది భక్తులు శిథిలాల కింద ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చారు. ఈ సమయంలోనే దుర్ఘటన చోటుచేసుకుంది.


ఘటనా స్థలిలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని హిమాచల్‌ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు తెలిపారు. మండి జిల్లాలోని సంబాల్ గ్రామంలో మెరుపు వరదలకు సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌లో సైన్యం, ఎన్‌డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. సిమ్లాలోని ఫాగ్లీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి చెందగా.. మరో 17 మందిని సహాయక సిబ్బంది రక్షించారు.


మండీ జిల్లాలో వర్షాలకు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. సోలన్‌ జిల్లా కూడా వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైంది. ఆదివారం రాత్రి జడోన్‌ గ్రామంలో క్లౌడ్ బరస్ట్‌తో సంభవించిన ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ నిర్మాణాల్లో ఒకటైన సిమ్లా-కల్కా రైల్వే మార్గంలో ఓ వంతెన వరద నీటికి దెబ్బతింది. దీంతో 50 మీటర్ల మేర రైలు పట్టాలు గాలిలోనే వేలాడుతూ కనిపించాయి.


వర్షాల కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సీఎం సుఖు సూచించారు. కాల్వలు, నదులకు సమీపంగా వెళ్లొద్దని, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని చెప్పారు. ఇటువంటి సమయంలో పర్యాటకులు తమ రాష్ట్రానికి రావద్దని ఆయన కోరారు. మరోవైపు, పక్కనే ఉన్న ఉత్తరాఖండ్‌నూ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆ రాష్ట్రంలో నలుగురు మృతి చెందారు. 9 మంది గల్లంతయ్యారు. కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, గంగోత్రిలకు వెళ్లే జాతీయ రహదారులు మూసుకుపోయాయి. దీంతో రెండు రోజులు పాటు చార్‌ధామ్‌ యాత్రను నిలిపివేస్తున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీ ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa