ఏపీలో ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదు.. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఎన్నికలు అంటున్నా సరే కసరత్తు మాత్రం మొదలైంది. ఈ క్రమంలో విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పాతబస్తీ పంజా సెంటర్లో నిర్వహించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకల్లో సజ్జల పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో అభ్యర్థులపై సంకేతాలు ఇచ్చారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వెలంపల్లి శ్రీనివాస్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. అలాగే విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్లను గెలిపించాలని పిలుపునిచ్చారు. పరోక్షంగా ముగ్గురు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లేననే విజయవాడలో చర్చ జరుగుతోంది. సజ్జల వ్యాఖ్యలతో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ముగ్గురి పోటీ దాదాపు ఖాయమైపోయినట్లే అంటున్నారు.
చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్లు వాలంటీర్లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండటం దారుణమన్నారు సజ్జల. కరోనా సమయంలో వాలంటీర్లు ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఆ సమయంలో చంద్రబాబు, పవన్ ఎక్కడికి పారిపోయారని.. కరోనా సమయంలో సేవలు అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ బెస్ట్ స్టేట్గా నిలిచిందన్నారు. సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థను దేశంలోని రాష్ట్రాలన్నీ ప్రశంసిస్తుంటే పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం బాబు, పవన్లకు మాత్రమే చెల్లిందన్నారు. రాష్ట్రంలో పాలనను ప్రతి గడపకూ తీసుకెళ్లడంలో సీఎం జగన్ విజయం సాధించారని.. ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరన్నారు. మళ్లీ వైఎస్ జగన్కే పట్టం కడతారన్నారు.
చంద్రబాబు దత్తత, సొంత కొడుకులు 2014-19 మధ్య ఏం చేశారో చెప్పుకోలేక.. ఏం చేస్తారో కొత్తగా చెప్పుకుంటున్నారని సెటైర్లు పేల్చారు. జనానికి జ్ఞాపకశక్తి లేదని చంద్రబాబుకు అపారమైన నమ్మకమని.. ఆయన చెబుతున్న దేనిలోనూ నిజాలు లేవన్నారు. ప్రజలను భ్రమలో పెట్టి ఐదేళ్ళు లాక్కొచ్చి కొడుక్కు అధికారం కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. గోడలు దూకడం తెలిసిన చంద్రబాబు.. కొడుక్కు కూడా అదే నేర్పిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అమరావతి పొలాల్లో ఉంది.. ఉన్న విజయవాడ మొండి గోడలతో వదిలేశారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు, బినామీలు ఉంచుకున్న 30 వేల ఎకరాల కోసం కృష్ణాజిల్లా ఎండబెట్టాలని చూశారన్నారు. జనాన్ని ముంచి తీసే రియాల్టర్ లాగా చంద్రబాబు చేశారని.. చంద్రబాబు, ఆయన బ్రోకర్ల కోసం కృష్ణాజిల్లాను తాకట్టు పెట్టారన్నారు. కృష్ణాజిల్లా మొత్తం గ్రీన్ బెల్ట్ చేసి అభివృద్ధి లేకుండా చేశారని.. నాశనం చేయడంలో చంద్రబాబు కు వరల్డ్ రికార్డు ఇవ్వొచ్చన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa