ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి రూ.300 దర్శన టికెట్లు,,,,వసతి గదుల కోటా కూడా రిలీజ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 23, 2023, 07:09 PM

టీటీడీ నవంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు, సేవ టికెట్లు, వసతి గదుల షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం న‌వంబ‌రు నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటా వివరాలను వెల్లడించింది. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం రూ.300 టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను ఆగ‌స్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేశారు.


మరోవైపు వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లను ఇవాళ (ఆగ‌స్టు 22) మ‌ధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆగ‌స్టు 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. శ్రీ‌వాణి ట్ర‌స్టు బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్ల‌ను ఆగ‌స్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులకు ద‌ర్శ‌న టోకెన్ల కోటాను ఆగ‌స్టు 23వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో వ‌స‌తి గ‌దుల బుకింగ్‌ ఆగ‌స్టు 25వ తేదీ ఉద‌యం 10 గంటలకు విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది.


ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమలనంబి 1050వ అవతార మహోత్సవం ఆగ‌స్టు 24వ తేదీ తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఘనంగా నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో భాగంగా శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఉద‌యం 9.30 గంటల నుండి 16 మంది ప్ర‌ముఖ పండితులు శ్రీ తిరుమ‌ల నంబి జీవిత చ‌రిత్ర‌పై ఉప‌న్య‌సించ‌నున్నారు. శ్రీవారి భక్తాగ్రేసరులలో ఒకరైన శ్రీ తిరుమలనంబి శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తీర్థ కైంకర్యం ప్రారంభించారు. వీరు భగవద్రామానుజుల వారికి స్వయాన మేనమామ, గురుతుల్యులు. వీరు రామానుజుల వారికి రామాయణ పఠనం చేశారని పురాణాల ద్వారా తెలుస్తోంది.


ఆచార్య పురుషుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమలనంబికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. తిరుమలనంబి శ్రీవేంకటేశ్వర‌స్వామివారి అభిషేకానికి సంబంధించిన పవిత్రజలాలను తిరుమల ఆలయానికి 8 కి.మీ దూరంలో ఉన్న పాపవినాశ‌నం తీర్థం నుండి తీసుకొచ్చేవారు. ఒకరోజు ఆయన పాపవినాశనం నుండి నీటిని కుండలో తీసుకొస్తుండగా సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామివారు తిరుమలనంబి భక్తిని పరీక్షించాలని భావించి ఒక వేటగాని రూపంలో వచ్చి దాహంగా ఉందని, తాగడానికి నీళ్లు కావాలని ఆడిగారు. ఈ పవిత్రజలాలు స్వామివారి ఆభిషేకం కోసమని చెప్పి ఇచ్చేందుకు తిరుమలనంబి తిరస్కరించారు. అంతట వేటగాని రూపంలో ఉన్న స్వామివారు రాయి విసిరి కుండకు చిల్లుచేసి నీరు తాగారు. అందుకు తిరుమలనంబి బాధపడుతూ ”వయోభారం కారణంగా నేను తిరిగి అంతదూరం పాపవినాశనం వెళ్లి స్వామివారికి అభిషేకజలం తీసుకురావడం సాధ్యంకాదు, ఈ రోజు నేను స్వామివారికి అభిషేకం చేయలేకపోతున్నా” అని దు:ఖించారు. అంతలో వేటగాని రూపంలో ఉన్న స్వామివారు ”చింతించకు తాతా నేను నీ పూజకు తప్పకుండా సహాయం చేస్తా” అని తెలిపి తన చేతిలోని విల్లును ఆకాశంలోనికి ఎక్కుపెట్టి బాణం వదిలారు. వెంటనే వినీలాకాశం నుండి ఉరుకుతూ నీటిధార భూమికి వచ్చింది. ”ఇకపై ఈ జలాన్నే నా అభిషేకానికి వినియోగించు” అని ఆ వేటగాని రూపంలో ఉన్న స్వామివారు అదృశ్యమయ్యారు. అప్పుడు తిరుమలనంబి సాక్షాత్తు స్వామివారే బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యారని గ్రహించారు. ఆనాటి నుండి నేటి వరకు ఈ తీర్థాన్నే స్వామివారి అభిషేకానికి వినియోగిస్తున్నారు. ఆకాశం నుండి వచ్చినందువల్ల ఈ తీర్థానికి ఆకాశగంగ అని నామధేయం ఏర్పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa