ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుల ఒక్కో అకౌంట్‌లో రూ.7,500 జమ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 31, 2023, 06:32 PM

ఏపీలో కౌలు రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ రైతులకు రైతు భరోసా అందించనున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ బటన్‌ నొక్కి నగదు జమ చేయనున్నారు. అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమకానుంది. కౌలు రైతులతో పాటుగా దేవాదాయ భూమి సాగుదారులకు కూడా సాయం అందనుంది. పంట హక్కు సాగు పత్రాలు పొందిన వారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, దేవదాయ భూము­లను సాగు చేస్తున్న రైతులకు ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున రూ.109.74 కోట్లు సాయం పంపిణీ చేయనున్నారు. కౌలు రైతుల కుటుంబాలతో పాటు దేవదాయ, అటవీ భూమి సాగుదారులకు కూడా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అందచేస్తోంది.


ఏపీలో కౌలు రైతులకు కౌలు కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా సీసీఆర్‌సీ (క్రాప్‌ కల్టివేషన్‌ రైట్స్‌ కార్డ్స్‌) మేళాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్బీకే స్థాయిలో మేళాలు నిర్వహిస్తున్నారు.. ప్రతి కౌలు రైతుకు రుణంతోపాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలన్న భావనతో పంట సాగు హక్కు పత్రాలు (కౌలు కార్డులు) జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కౌలు రైతులకు వంద శాతం పంట రుణాలు ఇవ్వాలని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను ప్రభుత్వం ఇప్పటికే ఆర్బీకేలతో అనుసంధానించిన సంగతి తెలిసిందే.


ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా దాదాపు 7.77 లక్షలమందికి ఈ ఏడాది కౌలు కార్డులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అందరి వివరాలను రైతు భరోసా పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు.. సెప్టెంబర్‌లో రైతు భరోసా సాయాన్ని అందించాలని భావించారు. కానీ ముందుగానే అకౌంట్‌లో డబ్బుల్ని జమ చేస్తున్నారు. కౌలు రైతులకు ఈ ఏడాది రూ.4వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.


ఈ ఏడాది కౌలు రైతులకు గతంలో కంటే ఎక్కువ కౌలు కార్డులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అర్హులైన ప్రతి కౌలు రైతుకూ పంట రుణాలతో పాటు ప్రభుత్వం అందించే సంక్షేమం అందించాలని భావించింది. ఈ నాలుగేళ్లలో 9 లక్షల మంది కౌలుదారులకు రూ.6,668.64 కోట్ల పంట రుణాలు అందించగా.. 3.92 లక్షల మంది కౌలుదారులకు వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.529.07 కోట్ల పెట్టుబడి సాయం అందించారు.


అలాగే ప్రభుత్వం 2.34 లక్షల మంది కౌలు రైతులకు రూ.246.22 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని అందించి. ఇటు 1.73 లక్షల మందికి రూ.487.14 కోట్ల ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందజేసింది. ప్రభుత్వం రైతు భరోసాను అకౌంట్‌లలో జమ చేయనుండటంతో కౌలు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వం రూ.4వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవడంపై సంతోషంగా ఉన్నారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం చెప్పిన సమయానికంటే ముందుగానే కౌలు రైతులకు రైతు భరోసా నిధుల్ని విడుదల చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa