చంద్రబాబు స్వతహాగా నేరస్వభావం కలిగిన వ్యక్తి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్డ్ నేరస్తుడని, ఆర్గనైజ్డ్ క్రిమినల్ అని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం చంద్రబాబు జైల్లో ఉండటానికి పరోక్షంగా ఈనాడు అధినేత రామోజీరావు కారణమని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... చంద్రబాబు స్వతహాగా నేరస్వభావం కలిగిన వ్యక్తి అన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు భ్రష్టుపట్టడానికి ఆయనే కారణమన్నారు. ఈ విషయంపై తాను ఎక్కడైనా, ఎలాంటి చర్చకైనా సిద్ధమని మీడియా ముఖంగా చెబుతున్నానన్నారు. ఓటుకు నోటు కేసు నుండి అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు... ఇలా అన్నింటా స్కామ్లు చేశారన్నారు. రాజకీయాలను సామాన్యులకు దూరం చేశాడని దుయ్యబట్టారు. డబ్బు ఉంటేనే రాజకీయాలు అనే సిద్ధాంతాన్ని తీసుకు వచ్చారని ఆరోపించారు. విద్యార్థి దశ నుండే ఆయన నీచ రాజకీయాలు చేశారన్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో నిన్న టీడీపీ బంద్కు పిలుపునిచ్చిందని, కానీ ఆ ప్రభావం ఏమీ కనిపించలేదన్నారు. టీడీపీ బంద్లో హెరిటేజ్ దుకాణాలు కూడా మూయలేదన్నారు. టీడీపీ మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు.
ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని, డబ్బుతో ముడిపెట్టి రాజకీయాలను నాశనం చేసిన వ్యక్తి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లోను షెల్ కంపెనీల ద్వారా బినామీ అకౌంట్లలోకి నిధులు మళ్లించారన్నారు. చంద్రబాబుపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ప్రతి కేసులోను స్టే తెచ్చుకున్నారన్నారు. చంద్రబాబుకు ప్రజాబలం ఉందనుకుంటే, ఆయన తప్పు చేయలేదని భావిస్తే స్టే తెచ్చుకోకుండా విచారణ ఎదుర్కోవాలని సవాల్ చేశారు. చంద్రబాబు చేయని అరాచకాలు లేవన్నారు. 2014లో ముఖ్యమంత్రి అయ్యాక అమరావతి పేరుతోనూ ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారన్నారు. అందుకే ఆయనను స్కిల్డ్ క్రిమినల్ అని సీఎం జగన్ అన్నారని, అంటే నైపుణ్యం కలిగిన నేరస్తుడని చెప్పారు. అలాంటి నైపుణ్యం కలిగిన నేరస్తుడిని పట్టుకోవడం, శిక్షించడం చాలా కష్టమన్నారు. చంద్రబాబు అవినీతిపరుడని మేం అంటున్నామని, కానీ ఆయన నీతిమంతుడని ఎవరూ చెప్పడం లేదన్నారు. తన తండ్రి నీతిమంతుడే అయితే ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో స్టే ఎందుకు తెచ్చుకున్నాడో నారా లోకేశ్ చెప్పాలని నిలదీశారు.
చంద్రబాబు ఇప్పుడు ఏ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అయితే అరెస్టయ్యారో దీనికి సంబంధించిన సీమెన్స్ సంస్థకు రూ.370 కోట్లు ముట్టలేదన్నారు. సీమెన్స్కు డబ్బులిచ్చామని టీడీపీ చెబుతుంటే, రాలేదని ఆ సంస్థ చెబుతోందన్నారు. అంటే రూ.370 కోట్లకు పైగా ప్రజాధనాన్ని దోచుకున్నారన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న 14 ఏళ్ల కాలంలో ప్రతిదీ కుంభకోణమే అన్నారు. హైదరాబాద్, అమరావతి, పోలవరం.. ఇలా అన్నీ స్కామ్లే అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత మాట్లాడేందుకు టీడీపీ వారే ముందుకు రావడం లేదన్నారు. అందుకే బెంగాల్, పంజాబ్, యూపీ, బీహార్కు ప్రతినిధులను పంపించి అక్కడి నేతలతో ట్వీట్లు పెట్టించడం, మీరు తనను చూసేందుకు వస్తే ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తానని చెబుతున్నారని ఆరోపించారు. తమను సమర్థించాలని వారికి సూచిస్తున్నాడన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa