ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖలో రెండో వందేభారత్ ర్యాక్,,,బోగీలను పరిశీలించిన వాల్తేరు డీఆర్‌ఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 16, 2023, 08:43 PM

విశాఖ నుంచి రెండో వందేభారత్ రైలు నడిపే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఈ మేరకు తూర్పు కోస్తా రైల్వే, వాల్తేర్‌ డివిజన్‌ న్యూ కోచింగ్‌ కాంప్లెక్స్‌లో వాల్తేరు డీఆర్‌ఎం సౌరభ్‌ ప్రసాద్‌ తనిఖీలు చేశారు. శుభ్రత, కోచ్‌ల నిర్వహణ, భద్రతకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్షించారు. కోచింగ్‌ కేర్‌ సెంటర్‌లో పలు రేక్‌ల నిర్వహణ విధానం, అందుబాటులో ఉన్న వసతుల గురించి ఆరా తీశారు. విశాఖలో ఉన్న రెండో వందేభారత్‌ రైలు బోగీలను పరిశీలించిన ఆయన ప్రయాణికుల అభిప్రాయాల విశ్లేషణ ఆధారంగా ఈ రైలును నడపడానికి ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. ఎల్‌హెచ్‌బీ బోగీల పరిశీలించిన ఆయన కీటకాలు, చెదల నివారణకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో సీనియర్‌ కోచ్‌ డిపో అధికారి ప్రవీణ్‌ భాటి తదితరులు పాల్గొన్నారు.


ఆగస్టులో చెన్నై నుంచి వందేభారత్ ర్యాక్‌ను విశాఖపట్నంకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రైలును ఏ రూట్‌లో నడుపుతారనే చర్చ మొదలైంది. అయితే విశాఖ సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందేభారత్‌ కోసం అదనంగా ఈ ర్యాక్‌ను తీసుకొచ్చారని చర్చ జరిగింది. అలాగే విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్‌ను నడుపుతారని ప్రచారం జరిగింది. అయితే నెల రోజులకుపైగా రెండో ర్యాక్ యార్డులోనే ఉంది.. ఇప్పుడు డీఆర్‌ఎం సౌరభ్‌ ప్రసాద్‌ పరిశీలించడంతో రెండో రైలును నడిపేందుకు ప్లాన్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. రెండో వందేభారత్‌ రైలు నడపడంపై మరో వాదన కూడా వినిపిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్‌లో మూడో ట్రాక్‌, ఇంటర్‌ లాకింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. అందుకే వందేభారత్‌ను నడపడం ఇబ్బంది అవుతుందనే కొంత సమయం తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది. మూడో ట్రాక్‌ పనులు పూర్తైన తర్వాత రెండో రైలును పట్టాలెక్కిస్తారని భావిస్తున్నారు. అయితే ఈ వందేభారత్‌ను తిరుపతికి నడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు.


ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి తిరుపతికి వెళ్లే భక్తులకు రైళ్ల కనెక్టివిటీ తక్కువనే చెప్పాలి. కొన్ని రైళ్లే అందుబాటులో ఉండటంతో తిరుపతికి వందేభారత్ నడిపితే ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందనే వాదన వినిపిస్తోంది. వందేభారత్ ఛార్జీలు ఎక్కువైనా సరే డిమాండ్ ఎక్కువగానే ఉంటుందంటున్నారు. త్వరలోనే రెండో రైలు రూట్‌పై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. ఏపీ మీదుగా ప్రస్తుతం రెండు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఒక రైలు నడుస్తుండగా.. మరో రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మరో రైలు నడుస్తోంది. అయితే మరో రెండు రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రారంభమవుతుందని ప్రచారం జరిగింది.. కానీ ఇంకా ఆలస్యం అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa