స్కిల్ డెవలప్మెంట్ స్కీం కేసులో అరెస్టయిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. అటు చంద్రబాబు తరపు న్యాయవాదులు, ఇటు సీఐడీ తరపు న్యాయవాదులు బలంగా తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. అయితే.. మొదట చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించారు. కేసులో వర్చువల్గా వాదనలు వినిపించిన హరీష్ సాల్వే.. సరైన పద్ధతిలో చంద్రబాబును అరెస్ట్ చేయలేదని.. గవర్నర్ అనుమతి తీసుకోలేదన్నారు. మాజీ సీఎం అయిన చంద్రబాబును గవర్నర్ అనుమతి తర్వాతే అరెస్ట్ చేయాలని తెలిపారు. ఈ క్రమంలో.. పలు కేసులను కూడా ఉదహరించారు.
మరోవైపు.. అరెస్ట్ చేసే సమయానికి ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు కూడా లేదన్నారు. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. సీఐడీ ఆరోపించినట్టు ఎక్కడా సాక్ష్యాలను తారుమారు చేయలేదని. ఈ కేసులో చంద్రబాబు సహకరిస్తున్నా.. అరెస్ట్కు తొందరపడ్డారని వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాన్ని పరిధి దాటి వాడిన సమయంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వర్చువల్గా తన వాదనలు వినిపించారు. రోహత్గీ తన వాదనలు వినిపిస్తూ... చంద్రబాబు క్వాష్ పిటిషన్కు అనర్హుడన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే చంద్రబాబును అరెస్ట్ చేయలేదని.. కేసు నమోదైన తర్వాత రెండేళ్ల పాటు సాక్ష్యాధారాలు సేకరించాకే అరెస్ట్ చేశారన్నారు. ఈ కేసులో పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు రోహత్గీ. సెక్షన్ 319 ప్రకారం ఎన్ని ఛార్జీషీట్లు అయినా వేయవచ్చునని.. ఎంతమంది సాక్ష్యులను అయినా కేసులను చేర్చవచ్చునన్నారు రోహత్గీ. రూ.3 వేల కోట్లు ఎక్కడకు వెళ్లాయో నిగ్గు తేల్చాల్సి ఉందన్నారు. ఈ కేసుకు సంబంధించి షెల్ కంపెనీల జాడ తీస్తున్నామన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎంవోయూ నుంచి సబ్ కాంట్రాక్ట్ ఎలా వెళ్లిందో తెలియాలన్నారు. అన్ని బోగస్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేశారన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా నిధుల దుర్వినియోగం జరిగిందని కోర్టుకు తెలిపారు. ఈ డీల్కు అసలు కేబినెట్ ఆమోదమే లేదన్నారు. టీడీపీ అధినేత పథకం ప్రకారమే తన అనుచరులతో కలిసి బోగస్ కంపెనీల పేరుతో రూ.371 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారంటూ రోహత్గీ వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa