మరికొన్ని రోజుల్లో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలతోపాటు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న వేళ కులగణన అంశం ప్రస్తుతం కీలకంగా మారింది. ఇటీవల బిహార్లో అధికారంలో ఉన్న నితీశ్ కుమార్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో కులగణన చేపట్టి నివేదికను విడుదల చేసింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు కులగణన చేపట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఒడిశాలో అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ ప్రభుత్వం.. ఇప్పటికే ఓబీసీ గణన చేపట్టగా.. త్వరలోనే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా కులగణన అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని బీజేపీని ఇరుకున పడేయాలని చూస్తోంది. అయితే కులగణన నిర్వహించేందుకు బీజేపీ వ్యతిరేకం కావడంతో అదే తమ ఎన్నికల్లో ప్రధాన ఆయుధంగా మార్చుకోవాలని హస్తం పార్టీ యోచిస్తోంది.
ఇక త్వరలోనే ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో మరోసారి అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. కులగణననే ప్రధాన అస్త్రంగా మార్చుకోవాలని చూస్తోంది. బిహార్ తరహాలోనే ఆ రాష్ట్రాల్లో కూడా కులాల వారీగా లెక్కలు తేల్చాలని యోచిస్తోంది. ఈ మేరకు తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ప్రకటించారు. శుక్రవారం జైపూర్లో జరిగిన రాష్ట్ర పార్టీ సమావేశం తర్వాత అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. కులగణన వ్యవస్థను తీసుకుస్తామని రాయపూర్లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో రాహుల్ గాంధీ స్పష్టం చేశారని అశోక్ గెహ్లాట్ గుర్తు చేశారు. అందుకు అనుగుణంగా ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో కులగణన జరిపిస్తామని తెలిపారు.
జనాభా ఆధారంగా వ్యక్తుల భాగస్వామ్యం ఉండాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. బిహార్ తరహాలోనే కుల ఆధారిత జనగణన నిర్వహణకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. మరోవైపు.. ఇప్పటికే ఛత్తీస్గఢ్లోని కాంకెర్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా కులగణన గురించి మాట్లాడారు. ఛత్తీస్గఢ్లో తిరిగి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే రాష్ట్రంలో కులగణన చేపడతామని ప్రియాంక గాంధీ ప్రకటించారు. మరోవైపు.. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. గ్రేటర్ ద పాపులేషన్.. గ్రేటర్ ది రైట్స్ అంటూ కొత్త నినాదాన్ని రాహుల్ గాంధీ ఇచ్చారు.
ఇక కులగణనను బీజేపీ సమర్థించడం లేదు. కుల ప్రాతిపదికపై హిందువులను విభజించేందుకే ప్రతిపక్ష పార్టీలు కులగణన డిమాండ్ను తెరపైకి తీసుకువస్తున్నాయని కాషాయ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. కులాల ఆధారంగా బీజేపీ ఓటు బ్యాంకును కొల్లగొట్టే ఎత్తుగడగా ఆరోపించింది. ఇక అసోంలో దేశీయ ముస్లిం సబ్ గ్రూపుల ప్రయోజనాల కోసం సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa