విజయవాడ దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబు మానవత్వం చాటుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఓ వృద్ధురాలి బాధను చూడలేక ఆమెకు సాయం చేశారు. అయితే ఆమె దారి తప్పి మూసివేసిన మార్గంలోకి వెళ్లింది. ఆ మార్గంలో ఏకంగా ఏడు అంతస్థులు ఎక్కింది. దీంతో అటువైపు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో అక్కడే నిలబడిపోయింది. అంత ఎత్తు ఎక్కిన తర్వాత అక్కడ గేటు మూసి ఉండటంతో ముందుకు వెళ్లలేక.. కిందికి దిగలేక అక్కడే కూలబడిపోయింది. ఇది చూసిన ఆలయ ఛైర్మన్ గేటుకు ఉన్న తాళాన్ని పగలగొట్టి వృద్ధురాలికి సాయం అందించారు. దీంతో తనకు అండగా నిలిచిన ఛైర్మన్కు వృద్ధురాలు ధన్యవాదాలు తెలిపింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభం కాగా.. ఆదివారం సెలవు కావడంతో చాలా మంది అమ్మవారి దర్శనం కోసం పోటెత్తారు. అయితే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేపట్టిన దుర్గగుడి అధికారులు.. మహా మండపం మెట్ల మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అటు వైపు ఉన్న గేటుకు జిల్లా కలెక్టర్ తాళం వేశారు. అయితే అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఓ వృద్ధురాలు ఆ విషయం తెలియక మహామండపం మెట్ల మార్గం వైపు వెళ్లింది. ఏడు అంతస్తులు ఎక్కిన తర్వాత అక్కడ గేటుకు తాళం వేసి ఉండటం చూసి షాక్ అయింది. అటు వైపు నుంచి మార్గం లేదని అక్కడ ఉన్న సిబ్బంది చెప్పడంతో పైకి వెళ్లలేక.. తిరిగి ఏడు అంతస్తులు కిందికి దిగలేక అక్కడే ఉండిపోయింది. ఎవరూ పట్టించుకోకపోవడంతో అరగంటకు పైగా మహామండపం ఏడో అంతస్తు వద్ద గేట్లను పట్టుకొని అక్కడే కూలబడిపోయింది.
అయితే అదే సమయంలో విజయవాడ దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబు.. ఇతర పాలకమండలి సభ్యులు అటు వైపుగా వెళ్తూ ఆ వృద్ధురాలిని చూశారు. వెంటనే అక్కడికి చేరుకుని.. ఏం జరిగిందని ఆరా తీశారు. గేటు లోపల చిక్కుకున్న వృద్దురాలి బాధను చూడలేక తాళాలు తీసేందుకు ప్రయత్నించారు. అయితే తాళాలు తమ వద్ద లేవని అక్కడ ఉన్న సిబ్బంది చెప్పడంతో.. చేసేదేం లేక ఛైర్మన్ కర్నాటి రాంబాబు స్వయంగా తాళాలు పగుల గొట్టారు. అనంతరం వృద్ధురాలిని బయటకు తీసుకొచ్చారు. తర్వాత ఆ వృద్ధురాలిని దగ్గరుండి అమ్మవారి దర్శనానికి పంపించారు. అయితే మహా మండపం మెట్ల మార్గం తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలియక 7 అంతస్థులు ఎక్కినట్లు వృద్ధురాలు తెలిపింది. అయితే తమ వాళ్లు కనిపించకపోవడంతో దారి తప్పి అటు వైపు వెళ్లినట్లు చెప్పింది. అయితే తన బాధను అర్ధం చేసుకుని బయటకు తీసుకొచ్చిన ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఇతర పాలక మండలి సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa