ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికారంలోకి వస్తే అదానీ గ్రూప్‌పై దర్యాప్తు చేయిస్తాం: రాహుల్ గాంధీ

national |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 09:07 PM

అదానీ గ్రూప్‌ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తాము అధికారంలోకి వస్తే అదానీ గ్రూప్‌పై విచారణ చేయిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బొగ్గు దిగుమతులపై అదానీ గ్రూప్ అధిక ధరలు చెల్లించడం కారణంగా దేశ ప్రజలపై కోట్లాది రూపాయల విద్యుత్ భారం పడుతోందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. బొగ్గు దిగుమతులు, అదానీ గ్రూప్ వ్యవహారంపై ప్రధాని మోదీ ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించిన రాహుల్ గాంధీ.. తక్షణమే దర్యాప్తు జరిపించి మిస్టర్ క్లీన్ పీఎం అనిపించుకోవాలని సూచించారు.


బొగ్గు దిగుమతుల్లో ఓవర్ ఇన్‌వాయిసింగ్‌‌ వల్ల విద్యుత్ ధరలు భారీగా పెరిగిపోయాయని అన్నారు. ఈ ప్రక్రియలో రూ.12 వేల కోట్ల ప్రజా ధనాన్ని అదానీ గ్రూప్ లూటీ చేసిందని రాహుల్ ఆరోపించారు. ప్రజల సొమ్మును కొల్లగొడుతున్న అదానీ గ్రూప్‌పై దర్యాప్తు జరిపించి ప్రధాని తన విశ్వసనీయతను నిరూపించుకోవాలని సూచించారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ ఈ ఆరోపణలు చేశారు. ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించిన ఓ వార్తా కథనాన్ని చూపించారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అదానీ గ్రూప్‌పై దర్యాప్తునకు ఆదేశిస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.


ఇండోనేషియా నుంచి అదానీ గ్రూప్‌ బొగ్గును దిగుమతి చేసుకుంటోందని.. ఆ బొగ్గు భారత్‌కు చేరేసరికి దాని ధర రెట్టింపు అవుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇలా అధిక ధరల కారణంగా సామాన్య ప్రజలు చెల్లించే విద్యుత్‌ బిల్లులు భారీగా పెరిగిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కొన్ని కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో పేదలకు ప్రభుత్వం సబ్సిడీలు చెల్లించాల్సి వస్తోందని రాహుల్‌ గాంధీ తెలిపారు.


ఈ క్రమంలోనే ఒకవేళ దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అదానీ గ్రూప్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు రాహుల్‌ సమాధానమిచ్చారు. ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తే దర్యాప్తునకు ఆదేశిస్తామని తేల్చి చెప్పారు. అసలు అదానీ గ్రూప్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని రాహుల్‌ ప్రశ్నించారు. బహిరంగ మార్కెట్‌ విలువ కంటే ఎక్కువ ధరకు అదానీ గ్రూప్‌ బొగ్గు దిగుమతి చేసుకున్నట్లు ప్రచురించిన ఫైనాన్షియల్ టైమ్స్‌ వార్తను రాహుల్‌ గాంధీ ప్రస్తావించారు. బొగ్గు దిగుమతిలో ఓవర్ ఇన్‌వాయిసింగ్ వల్ల దేశంలోని విద్యుత్ రేట్లపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ఈ కారణంగానే విద్యుత్ వినియోగదారులు ఎక్కువగా బిల్లులు చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. ఇది ప్రత్యక్ష దోపిడీ అని.. ప్రపంచంలో ఉన్న ఏ ప్రభుత్వమైన ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకుంటుందని.. కానీ మన దేశంలో మాత్రం అలాంటి చర్యలు లేవని మోదీ సర్కార్ తీరును రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు.


ఈ సందర్భంగా అదానీ గ్రూప్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ.. అదానీకి ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తోందని మండిపడ్డారు. అదానీ వెనుక ఏ శక్తి ఉందో దేశ ప్రజలందరికీ తెలుసని విమర్శలు గుప్పించారు. స్టాక్ ధరల్లో అవకతవకలకు పాల్పడుతున్నారని అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసినపుడు కూడా తాను ప్రశ్నించినట్లు రాహుల్ గుర్తు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa