తిరుమల నడక మార్గంలో మళ్లీ చిరుత సంచారం అలజడి రేపుతోంది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుతపులి, ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ నెల 24 నుంచి 27 మధ్యన ఈ దృశ్యాలు నమోదైనట్లు టీటీడీ అధికారులు తెలిపారు. చిరుత, ఎలుగుబంటి సంచారం నేపథ్యంలో నడక దారి భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. భక్తులు జాగ్రత్తగా ఉండాలని, గుంపులు గంపులుగా వెళ్లాలని సూచించింది. చిరుతను, ఎలుగుబంటిని బంధించేందుకు ఫారెస్టు అధికారులతో కలిసి చర్యలు చేపట్టినట్లు టీటీడీ వెల్లడించింది.
తిరుమలలో కొన్ని నెలలుగా చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 11న తిరుమల మెట్ల మార్గంలో లక్షిత అనే చిన్నారిపై చిరుత పులి దాడి చేసి చంపేసింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. నాటి నుంచి తిరుమలకు వచ్చే భక్తులు ఒకింత భయాందోళనకు గురవుతున్నారు. చిరుత దాడి ఘటనతో అప్రమత్తమైన టీటీడీ.. అటవీ శాఖ అధికారులతో కలిసి తిరుమల కొండల్లో పలుచోట్ల బోన్లను, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసింది. అనంతరం ఐదు చిరుతలు బోన్లలో చిక్కాయి. ఆ చిరుతలను అటవీ శాఖ అధికారులు దట్టమైన అడవుల్లో వదిలిపెట్టారు. ఆ తర్వాత తిరుపతి ఎస్వీయూ క్యాంపస్లోనూ చిరుతపులి కలకలం రేపింది.
తిరుమల, తిరుపతిలో చిరుతపులుల సంచారం నేపథ్యంలో.. నడక మార్గంలో వెళ్లే భక్తులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా భక్తుల చేతికి కర్రలు ఇస్తోంది. అంతేకాకుండా.. భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తూ.. బృందానికి ఒకరు చొప్పున గార్డును నియమిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత చిన్నారులను నడక మార్గంలో అనుమతించడంలేదు. అంతేకాకుండా.. చిన్నారులకు ట్యాగింగ్ను కూడా ఇస్తున్నారు టీటీడీ అధికారులు. ఇవన్నీ చర్యల మధ్య తాజాగా మరోసారి చిరుతపులి, ఎలుగుబంటి సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు లభించడం మళ్లీ కలకలం రేపుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa