ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవంబరు 3వ తేదీకి వాయిదా పడిన కోడికత్తికేసు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 28, 2023, 02:17 PM

కోడికత్తి కేసులో అరెస్టయి ఐదేళ్లుగా రిమాండ్‌ ఖైదీగా ఉన్న తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు జనిపల్లి శ్రీనివాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్‌ ఏవీ రవీంద్రబాబుతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఎన్‌ఐఏను ఆదేశిస్తూ.. విచారణను నవంబరు 3వ తేదీకి వాయిదా వేసింది. విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్‌పై 2018లో జనిపల్లి శ్రీనివాస్‌ కోడికత్తితో దాడి చేసిన ఘటన తెలిసిందే. అప్పటి నుంచి రిమాండ్‌ ఖైదీగా జైల్లోనే మగ్గుతున్న ఆయన ఈ ఏడాది సెప్టెంబరు 22న బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరిస్తూ విశాఖ ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది పి. శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ శ్రీనివాస్‌ గత ఐదేళ్లుగా జైలులో ఉన్నారన్నారు. కోడికత్తితో తనపై దాడి ఘటనకు సంబంధించి లోతైన విచారణ జరపాలని బాధితుడు ప్రస్తుత సీఎం జగన్‌ హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. ఈ వ్యవహారంలో విచారణ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని, జ్యుడీషియల్‌ రిమాండ్‌లోనే సగం శిక్షాకాలం అనుభవించినవారికి బెయిల్‌ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్‌ శ్రీనివాస్‌కు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. ఎన్‌ఐఏ తరఫున ఇన్‌చార్జి డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ యజ్ఞదత్‌ స్పందిస్తూ.. పిటిషనర్‌కు ఎన్‌ఐఏ కోర్టు గతంలో బెయిల్‌ మంజూరు చేయగా హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు. కోడికత్తి ఘటనపై లోతైన విచారణ జరపాలని బాధితుడు(సీఎం జగన్‌) వేసిన పిటిషన్‌ను విచారించి, ఎన్‌ఐఏ కోర్టులో కేసుకి సంబంధించి తదుపరి చర్యలను నిలుపుదల చేసిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa